అందమైన విద్యార్థినులు క‌నిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి..` | Sakshi
Sakshi News home page

అందమైన విద్యార్థినులు క‌నిపించారంటే.. అతడు కీచకుడే! అర్ధరాత్రి..

Published Mon, Dec 25 2023 1:34 AM

- - Sakshi

వ‌రంగ‌ల్‌/మహబూబాబాద్‌: హనుమకొండ జిల్లా భీమారంలోని శ్రీ చైతన్య కళాశాల అధ్యక్షుడు బూర సురేందర్‌ గౌడ్‌ కీచకుడని తేలింది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఈమేరకు నిందితుడు సురేందర్‌గౌడ్‌తో పాటు అతడికి సహకరించిన మెస్‌ ఇన్‌చార్జ్‌ శ్రవణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు హనుమకొండ ఏసీపీ కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆదివారం వెల్లడించారు.

హసన్‌పర్తి మండలం భీమారానికి చెందిన బూర సురేందర్‌గౌడ్‌ స్థానికంగా శ్రీ చైతన్య ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల నిర్వహిస్తున్నాడు. నాలుగు అంతస్తుల భవనం.. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కళాశాల కార్యాలయం, మొదటి ఫ్లోర్‌లో తరగతులు, రెండు, మూడు ఫ్లోర్లలో హాస్టల్‌, నాలుగో ఫ్లోర్‌లో ఇద్దరు భార్యలు రేణుక, సంధ్య, ఇద్దరు పిల్లలతో సురేందర్‌గౌడ్‌ నివాసముంటున్నాడు. ప్రస్తుతం బాలికల క్యాంపస్‌లో 160 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు.

సురేందర్‌గౌడ్‌ సస్పెన్షన్‌
హసన్‌పర్తి: 
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భీమారానికి చెందిన శ్రీ చైతన్య జూని యర్‌ కళాశాల చైర్మన్‌ బూర సురేందర్‌గౌడ్‌ను బీజేపీ 55వ డివిజన్‌ అధ్యక్ష పదవితోపాటు ప్రాథమిక సభ్యత్వంనుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి బి.ఉమాశంకర్‌ సోమవారం ప్రకటించారు. నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీకి అప్రతిష్ట కలిగేలా ప్రవర్తిస్తూ, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు వేటు వేసినట్లు చెప్పారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తోందని పేర్కొన్నారు. వారం రోజుల్లో రాష్ట్ర పార్టీకి వివరణ ఇవ్వాలని సూచించారు.

అర్ధరాత్రి ఫోన్‌ చేసి..
ఈనెల 22వ తేదీ రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో హాస్టల్‌లో ఉన్న ఆ విద్యార్థినికి శ్రవణ్‌ ఫోన్‌ చేసి కిందికి రమ్మన్నాడు. భయపడిన ఆ విద్యార్థిని స్నేహితులతో కలిసి గ్రౌండ్‌ ఫ్లోర్‌లోకి వచ్చింది. వారిని చూసిన సురేందర్‌రెడ్డి ఆగ్రహంతో ఆ విద్యార్థినిని దూషించడమే కాకుండా బెదిరింపులకు గురిచేశాడు. అడ్డుగా వచ్చిన మరో విద్యార్థినిపై చేయి చేసుకుని అక్కడి నుంచి సురేందర్‌, శ్రవణ్‌ పరారయ్యారు. కళాశాలలో అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు.. సురేందర్‌ గౌడ్‌ వారితో లైంగిక వాంఛ తీర్చుకోవడానికి యత్నించే వాడని, అసభ్యంగా ప్రవర్తించేవాడని ఏసీపీ కిరణ్‌కుమార్‌ వివరించారు.

విద్యార్థినిపై కన్ను..
హాస్టల్‌లో ఉంటూ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిపై కన్ను వేసిన సురేందర్‌గౌడ్‌ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి యత్నించాడు. ఇందుకు ఫీజు మాఫీ చేస్తానని.. డబ్బులు కూడా ఇస్తానని మభ్యపెట్టాడు. ఇందుకు హాస్టల్‌లో మెస్‌చార్జ్‌గా పని చేస్తున్న చెన్నారావుపేటకు చెందిన శ్రవణ్‌ సహకారం తీసుకున్నాడు. పలుమార్లు మాటలతో వేధించడమే కాకుండా అసభ్యకరంగా వ్యవహరించినా ఆ విద్యార్థిని లొంగలేదు.

విద్యార్థి సంఘాల ఆందోళన..
కళాశాలలో చోటు చేసుకున్న ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఈమేరకు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం వడ్డేపల్లి చర్చి వద్ద సురేందర్‌, శ్రవణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ఘటనకు సంబంధించిన వాస్తవాలు అంగీకరించారని ఏసీపీ చెప్పారు. సమావేశంలో సీఐ అబ్బయ్య, ఎస్సై సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి: నా గురించి తెలుసుకదా..! అలా చేయ‌లేదంటే మిమ్మ‌ల్నీ?

Advertisement
Advertisement