కర్నూలు(సెంట్రల్): కళామతల్లికి బళ్లారి రాఘవ చేసిన సేవలు ఎనలేనివని జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకట నారాయణమ్మ కొనియాడారు. ఆదివారం ఉదయం కలెక్టట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో టూరిజం, ఐసీడీఎస్ శాఖల ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగ పితామహుడు, మహానటుడు బళ్లారి రాఘవ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో బళ్లారి రాఘవ 1880 ఆగస్టు 2న జన్మించి తాడిపత్రి, బళ్లారి, మద్రాస్లలో విద్యాభ్యాసం పూర్తి చేసి న్యాయవాదిగా స్థిరపడ్డారని చెప్పారు. ఆయన తెలుగు నాటక రంగానికి విశేషమైన కృషి చేసి కళాకారుడిగా దేశ, విదేశాల్లో పేరు గడించారని చెప్పారు. సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ మాట్లాడుతూ.. బళ్లారి రాఘవ కర్నూలుకు చెందిన కృష్ణమ్మను వివాహం చేసుకున్నారని, ఆయన్ను బ్రిటీష్ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించి రావు బహుదూర్ బిరుదు ఇచ్చినట్లు చెప్పారు. బెంగళూరులో మహాత్మాగాంధీ బళ్లారి రాఘవ నటించిన దీనబంధు కబీర్ నాటికను తిలకించి రాఘవ మహారాజుకి జై అని అన్నట్లు చరిత్ర చెబుతోందని వివరించారు. లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, ఏపీ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కరణ్, డీవీఎం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


