కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదుల్లో అధిక భాగం రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయి. నిషేధిత జాబితా 22ఏ నుంచి తొలగించాలని కోరుతూ ఎక్కువ మంది రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ ప్రజల నుంచి పీజీఆర్ఎస్లో భాగంగా వినతులను స్వీకరించారు. సమస్యలను సరైన పరిష్కారాలు చూపాలని కింది స్థాయి అధికారులకు సూచించారు.
90 ఎకరాల భూమి ఇచ్చినా
బువ్వ పెట్టడం లేదు
‘‘నా పేరు పద్మావతమ్మ. పత్తికొండ మండలంలోని దేవనబండ గ్రామం. నా భర్త శ్రీనివాసరెడ్డి 14 సంవత్సరాల క్రితమే చనిపోయారు. ఇప్పుడు నా వయస్సు సుమారు 85 ఏళ్లు. నాకు ముగ్గురు కుమారులు. మొత్తం 90 ఎకరాల భూమి ఉంది. ముగ్గురికీ 30 ఎకరాలు చొప్పున భాగ పరిష్కారం చేసి వారి పేరిట రాసిచ్చాం. ఇంత ఆస్తి ఇచ్చినా కొడుకులు నన్ను పట్టించుకోవడం లేదు. ముద్ద బువ్వ పెట్టడంలేదు. ఈ వయస్సులో ఆకలితో జీవితాన్ని గడుపుతున్నా. పెద్ద కుమారుడు బీమిరెడ్డి కొంత నా పోషణ చేస్తున్నారు. నా భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు రూ.15 లక్షలు ఖర్చు చేశాడు. ఇటీవల నాకు ఆరోగ్యం బాగోలేకపోతే పెద్ద ఆపరేషన్ చేయించాడు. అతను కూడా కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని దాదాపు 10 ఎకరాల పొలాన్ని అమ్ముకున్నాడు. అయితే మిగిలిన ఇద్దరు కుమారులు నా పోషణ గురించి అడిగితే పట్టించుకోవడం లేదు. పైగా ఈ వయస్సులో తనను కొట్టేందుకు వస్తున్నారు. వారసత్వంగా వారి ఇద్దరికీ వచ్చిన భాగ పరిష్కారం భూమి 60 ఎకరాలను రద్దు చేసి నా పేరిట చేర్చాలి.’’ అని కలెక్టర్కు వేడుకున్నారు. కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి స్పందిస్తూ పత్తికొండ ఆర్డీఓకు ఫోన్ చేశారు. పద్మావతమ్మ ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆమె కోరిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


