పాణ్యం: గోరుకల్లు జలాశయాన్ని పరిశీలించేందుకు వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఎక్కడికక్కడే చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంగళవారం ఉదయం నుంచి పాణ్యం రహదారి డొంగు వద్ద పోలీసులు గోరుకల్లు వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేసి పంపారు. అనుమానం వచ్చిన వాహనాలను దారి మళ్లించారు. అలాగే గోరుకల్లు గ్రామం వద్ద ప్రముఖుల వాహనాలనే జలాశయం వద్దకు పంపించారు. మిగతా వాహనాలను ఆపేశారు. కట్టపై బురద ఉందని వాహనాలను అడ్డుకున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, రైతు సంఘాల నాయకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అడుగడుగునా పోలీసులు ఇబ్బందులు పెట్టినా రైతులు, నాయకులు రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు.
సంజామల: అవుకు రిజర్వాయర్ సందర్శనకు వెళ్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు అవుకు రిజర్వాయర్ను సందర్శించారు. వారికి సంఘీభావం తెలపడానికి వెళ్తున్న మండల నాయకులు, కార్యకర్తలను ఆకుమల్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు.


