వెల్దుర్తి: స్థానిక బీసీ బాలికల హాస్టల్లో ఓ విద్యార్థిని బంధువు ఆదివారం హల్చల్ చేశాడు. హాస్టల్ సిబ్బందిపైనే దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గిరిజాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటుపల్లె గ్రామానికి చెందిన శశికళ ప్రస్తుత ఏడాది 6వ తరగతిలో చేరింది. హాస్టల్లో ఉండనంటూ భీష్మించడంతో తల్లికి సమాచారం అందించారు. ఆదివారం కావడంతో హాస్టల్కు వచ్చిన తల్లి కుమార్తెను బయటకు తీసుకెళ్లింది. విద్యార్థిని బాబాయ్ మహేశ్తో కలిసి ఒప్పించి తిరిగి హాస్టల్లో వదిలారు. తర్వాత బాబాయ్ తిరిగి వచ్చి తెలుపు రంగు ద్రావణం ఉన్న ఓ బాటిల్ను గేటు వద్ద ఉన్న విద్యార్థినికి ఇచ్చి ‘ఈ కూల్డ్రింక్ను హాస్టల్లో ఉంటున్న శశికళకు ఇవ్వమని’ అందించాడు. సదరు విద్యార్థిని ఆ బాటిల్ను శశికళకు అందజేయగా తాగి ఉప్పగా ఉండడంతో ఊసేసింది. విషయం తెలుసుకున్న సిబ్బంది అనుమానం కలిగి విద్యార్థిని బాబాయ్కు ఫోన్ చేసి పిలిపించారు. అతను హాస్టల్లోకి వచ్చి సిబ్బందిని దూషిస్తూ, దాడికి పాల్పడ్డాడు. ఘటనపై హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గిరిజాదేవి, సిబ్బంది కలిసి స్థానిక పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. బాబాయ్ను విచారించగా తాను బాటిల్ ఇవ్వలేదని చెబుతున్నాడని, సీసీ పుటేజీ, బాటిల్ ద్రావణంపై పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


