శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని బుధవారం చెంచులకు కల్పించారు. శ్రీశైలం చెంచుగూడెంతో పాటు మార్కాపురం జిల్లా నుంచి 315 మంది, నంద్యాల – 120 మంది, పల్నాడు జిల్లా నుంచి 175 మంది చెంచు భక్తులు శ్రీశైలం చేరుకుని మల్లన్న స్పర్శ దర్శనం చేసుకున్నారు. చెంచులు సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ దర్శనానికి వచ్చారు. ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. అనంతరం చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం చెంచులకు మల్లన్న స్పర్శ దర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అలాగే అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. చెంచు భక్తులతో పాటు ట్రస్ట్బోర్డు సభ్యురాలు గుల్లా గంగమ్మ పాల్గొన్నారు.
కుటుంబ సమస్యలతో ఆత్మహత్య
డోన్ టౌన్: కుటుంబ సమస్యలతో మద్యానికి బానిసై పాతపేటకు చెందిన మడ్డి వెంకటేశ్వర్లు (48) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన మడ్డి వెంకటేశ్వర్లు, భార్య మడ్డి రాజమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారి ఒక్కగానొక్క కుమారుడు 12 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ దిగాలుతో రాజమ్మ పక్షవాతం భారిన పడటంతో వెంకటేశ్వర్లు మరింతగా కుంగిపోయి మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగి ఇంటికి రాగా గుర్తించిన భార్య కాలనీవాసుల సహాయంతో డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించగా కోలుకోలేక బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.


