మోటర్‌ తెచ్చిన తంటాలు | - | Sakshi
Sakshi News home page

మోటర్‌ తెచ్చిన తంటాలు

Apr 17 2025 1:25 AM | Updated on Apr 17 2025 1:25 AM

మోటర్‌ తెచ్చిన తంటాలు

మోటర్‌ తెచ్చిన తంటాలు

రెబ్బెన/బెల్లంపల్లి: బెల్లంపల్లి సింగరేణి ఏరియాలోని మాదారం టౌన్‌షిప్‌లో కార్మికులు, కార్మికేతర కుటుంబాలను జనవరి నుంచి నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. తరచూ మోటర్లు కాలిపోతుండగా, మరమ్మతులకు గరిష్టంగా రెండు వారాలపైనే సమయం పడుతోంది. వేసవి కావడంతో నీటి కోసం కాలనీ ప్రజలు అల్లాడుతున్నారు. తాజాగా మంగళవారం రాత్రి మరోసారి మోటర్‌ చెడిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. మాదారం కాలనీవాసులకు మహావీర్‌ఖని(ఎంవీకే) –1 ఇంకై ్లన్‌ సమీపంలో వేసిన బోర్‌లో మోటర్‌ బిగించి అంతర్గత పైపులైన్‌ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. అయితే అంతుచిక్కని కారణాలతో ఇక్కడ ఏర్పాటు చేసిన పంపు మోటరు తరచూ చెడిపోతోంది. నాలుగు నెలల్లో నాలుగుసార్లు మరమ్మతులకు గురైంది. గడిచిన నెలన్నర వ్యవధిలోనే రెండుసార్లు చెడిపోయిందని స్థానికులు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ఆదేశాల మేరకు సింగరేణి జీఎం రెండు కొత్త పంపు మోటర్లను తెప్పించారు. 75 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటర్లు తీసుకురాగా, అవి బోర్‌ హోల్‌లో పట్టలేదు. కొత్తగా బోరులో పట్టే మోటర్లను తీసుకువచ్చి బిగించడం లేదా 75 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటర్లకు సరిపడేలా కొత్త బోరు హోల్‌ వేయడమో చేస్తేగానీ నీటి సమస్య తీరే అవకాశం కనిపించడం లేదు.

రోడ్డుపై కాలనీవాసుల ఆందోళన

తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో మా దారంటౌన్‌ షిప్‌ కార్మిక కుటుంబాల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. కైరిగూడ ఆర్చీ వద్ద సింగరేణి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ మాదారం టౌన్‌షిప్‌లో నెలలో పది నుంచి పద్నాలుగు రోజులపాటు నీటి సరాఫరా లేకపోతే కార్మిక కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. నీటి సరాఫరా నిలిచిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరాఫరా చేస్తూ చేతులు దులుపుకొంటున్నారన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే జీఎం కార్యాలయం ఎదుట బైఠాయిస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఎస్వోటూజీఎం రాజమల్లు సంఘటన స్థలానికి వెళ్లి ఐఎన్‌టీయూసీ, కార్మిక కుటుంబాలతో మాట్లాడారు. రెండు రోజుల్లో పంపులకు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని, అప్పటివరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్మిక కుటుంబాలకు మద్దతుగా ఏఐటీయూసీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. సెంట్రల్‌ కమిటీ నాయకులు ప్రకాశ్‌రావు, రామారావు, ఏరియా కార్యదర్శి చంద్రకుమార్‌, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి తిరుపతి, ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, కార్మికులు అనిల్‌, పోశం, శంకర్‌, రఘునాథరెడ్డి, రమేశ్‌, సత్యనారాయణ, మధు తదితరులు పాల్గొన్నారు.

నాలుగు నెలలుగా తరచూ కాలిపోతున్న వైనం

మాదారం టౌన్‌షిప్‌ కాలనీవాసులకు తప్పని నీటి కష్టాలు

సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement