మధిర: మధిరలో ప్రజావాణికి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మాత్రమే సరిగ్గా ఉదయం 10 గంటలకు హాజరయ్యారు. మిగిలిన శాఖల అధికారులెవరూ ఆ సమయానికి రాలేదు. ఇక 10–30 గంటలకు ఎనిమిది శాఖల అధికారులు హాజరయ్యారు. తహసీల్దార్ రాంబాబు కార్యాలయ పనుల నిమిత్తం ఉండగా, మున్సిపల్ కమిషనర్ తీరిగ్గా 11 గంటలకు వచ్చారు. పలు గ్రామాల విలీనంతో ఏర్పడిన మధిర మున్సిపాలిటీలో సుమారు 40 వేల మంది జనాభా ఉండగా.. ప్రజావాణికి హాజరై సకాలంలో హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించాల్సిన కమిషనర్ ఆలస్యంగా రావడం గమనార్హం. బాధ్యతాయుతమైన అధికారే ఇలా వ్యవహరిస్తే మిగతా వారి పరిస్థితి ఏమిటని పలువురు చర్చించుకున్నారు. ఇంకొన్ని శాఖల అధికారులు ఒక్కరొక్కరుగా వచ్చినా... కాసేపటికి వెనుతిరగా, మరికొన్ని శాఖల అధికారులు పూర్తిగా గైర్హాజరయ్యారు. ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలోనే ఆఫీస్ ఉండే ఎంఈఓ రాకపోగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధీనంలోని విద్యుత్ శాఖ నుంచి ఏ అధికారికి హాజరుకాకపోవడం గమనార్హం. స్వచ్ఛంద సంస్థలకు స్థలాలు కేటాయించాలని ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకులు దోర్నాల రామకృష్ణ వినతిపత్రం ఇవ్వగా, రోడ్ల మరమ్మతు, ఆర్టీసీ బస్సు ఏర్పాటు, వయోవృద్ధులకు డేకేర్ సెంటర్ ఏర్పాటుపై స్థానికులు.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పునరుద్ధరించాలని బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రాలు అందజేశారు.


