ఇంటింటా ప్రచారం
త్వరలోనే అమలు
● జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనంపై సందిగ్ధత ● అమలు ఎప్పుడో స్పష్టత కరువు ● ప్రారంభిస్తేనే విద్యార్థులకు మేలు
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ విద్యాసంవత్సరం మొదలై నెలలు గడుస్తున్నా ప్రకటన ఆచరణ రూపం దాల్చకపోవడంతో విద్యార్థులు ఎప్పుడు అమలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, త్వరలోనే పథకాన్ని అమలుచేసే అవకాశముందని విద్యార్థుల హాజరు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. విడతల వారీగా ప్రారంభిస్తారని తెలుస్తున్నా, ఏయే కళాశాలల్లో మొదట అమలవుతుందో స్పష్టత రాలేదు. కాగా, జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా.. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 5,540మంది చదువుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల వారే ఎక్కువ
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే ఎక్కువగా చదువుతున్నారు. వీరు ఉదయం 7–30 నుంచి 8గంటల మధ్య ఇళ్ల నుంచి బయలుదేరి పట్టణ, మండల, జిల్లా కేంద్రాల్లోని కాలేజీలకు వస్తారు. ఈ సమయానికి ఇళ్లలో భోజనం సిద్ధం కాకపోవడంతో అలాగే వస్తున్నారు. కాలేజీలో భోజనం లేక, బయట తినే స్థోమత లేక తిరిగి రాత్రి 6గంటలకు ఇళ్లు చేరేవరకు ఆకలితో అలమటించాల్సి వస్తోంది. ఇకనైనా మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభిస్తే మరింత మంది గ్రామీణ విద్యార్థులు కాలేజీల్లో చేరే అవకాశమున్నందున ప్రభుత్వ త్వరగా స్పందించాలని పలువురు కోరుతున్నారు.
విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు అధ్యాపకులు ఇంటింటా ప్రచారం చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు అందుతాయని, మెరుగైన బోధన ఉంటుందని వివరించారు. అంతేకాక ఈ ఏడాది నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నట్లు తెలిపారు. దీంతో విద్యార్థుల నుంచి ఆశించిన స్పందన లభించింది. అయితే, కాలేజీలు మొదలై నెలన్నర దాటినా భోజనం అమలుపై స్పష్టత లేక దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు గతంలో మాదిరిగానే ఆకలితో పాఠాలు వినాల్సి వస్తోంది. అంతేకాక విద్యార్థులు, తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు అధ్యాపకులు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం త్వరలో అమలయ్యే అవకాశం ఉంది. తొలుత జిల్లాలోని ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో ప్రారంభం అవుతుంది. ఇప్పటికే కాలేజీల వారీగా విద్యార్థుల సంఖ్య, హాజరు వివరాలు సేకరించాం.
– రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి


