కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రజని తెలిపారు. బీఎస్సీ, బీకాం, బీకామ్ కంప్యూటర్స్, బీఏ, బీబీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న ఉమ్మడి జిల్లాలోని గిరిజన విద్యార్థినులు ఈనెల 26లోగా కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె ఓ ప్రకటనలో సూచించారు.
ఉపకార వేతనాలకు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అదికారి జి.జ్యోతి సూచించారు. 2026–27 ఏడాదికి గాను కళాశాల విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసం http://telanganaepass. cgg.gov.in ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ఈ ఏడాది విద్యార్థులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నగదును నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారని వెల్లడించారు.
108 ఈఎంఈగా ప్రవీణ్కుమార్
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా అత్యవసర సేవల విభాగం 108 సర్వీస్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్(ఈఎంఈ) గా ఆలేటి ప్రవీణ్కుమా ర్ నియమితులయ్యా రు. ఇన్నాళ్లు ఈఎంఈ గా ఉన్న అవులూరి దుర్గాప్రసాద్ వనపర్తి జిల్లాకు బదిలీ కాగా, ఆయనను ఖమ్మం కార్యాలయంలో ఆదివారం 108, 1962, 102 వాహనాల ఉద్యోగులు సన్మానించి వీడ్కోలు పలికా రు. అనంతరం ప్రవీణ్కుమార్ బాధ్యతలు స్వీకరించగా శుభాకాంక్షలు తెలిపారు. అత్యవసర సర్వీసుల విభాగం అధికారులు, ఉద్యోగులు షేక్ నజీరుద్దీన్, షేక్ ఇమామ్ పాషా, తుమ్మా జగదీష్, శ్రీనివాస్, కొమ్ము వెంకటేష్, గొల్లమందల కృష్ణ, భాస్కర్, వినోద్రావు, మేడా పుల్లారావు, భూషయ్య, కృష్ణయ్య, రేణుక, విజయలక్ష్మి, సంగిశెట్టి మోహన్, సయ్యద్ ఖాద్రీ, సీతా రాంబాబు పాల్గొన్నారు.
అంచనాల కమిటీ చైర్మన్గా ఇల్లెందు ఎమ్మెల్యే కనకయ్య
● సభ్యుడిగా వైరా ఎమ్మెల్యేకు స్థానం
ఇల్లెందు: శాసనసభ, శాసన మండలి అంచనాల కమిటీ చైర్మన్గా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ కమిటీ సభ్యుడిగా వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్నాయక్తో పాటు సునీతా లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎం.యశశ్వినిరెడ్డి, పి.రాకేష్రెడ్డి, ఎమ్మెల్సీలు సుంకరి రాజు, తక్కెళ్లపల్లి రవీందర్రావు, వంటేరు యాదవ రెడ్డి నియమితుయ్యారు. కాగా, కనకయ్య, రాందాస్ నియామకంపై ఉమ్మడి జిల్లా ప్రప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
వైభవంగా నదీహారతి
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద ఆదివారం గోదావరికి నదీ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య గణపతి పూజ, 108 ప్రమిదల దీపోత్సవం, అష్టోత్తర శతనామార్చనలు చేశారు. అనంతరం సీతారాములకు 12 సార్లు, గోదావరి మాతకు 21 సార్లు హారతులు సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పురోహితులు రామవజ్జల రవికుమార్, పవన్ కుమార్ శర్మ, సత్యప్రసాద్ శర్మ, ఫణికుమార్ శర్మ, భక్తులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. పాల్వంచ మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అమ్మవారికి ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


