'లంచం అడిగిన ఆర్‌ఐ..' సోషల్‌ మీడియాలో వాయిస్‌ వైరల్‌! | - | Sakshi
Sakshi News home page

'లంచం అడిగిన ఆర్‌ఐ..' సోషల్‌ మీడియాలో వాయిస్‌ వైరల్‌!

Dec 14 2023 12:08 AM | Updated on Dec 14 2023 1:44 PM

- - Sakshi

ఖమ్మం: వ్యవసాయ క్షేత్రంలో బోరు బావి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రంపై సంతకం చేయడానికి దమ్మపేట మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ లంచం డిమాండ్‌ చేయగా.. బాధితుడు చేసిన ఆడియో రికార్డ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మండలంలోని మందలపల్లికి చెందిన మడిపల్లి వెంకటేశ్వరరావు మల్లారంలోని మట్టా ధనదుర్గకు చెందిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆ భూమిలో పాత బోరు బావి ఉండగా విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకునేందుకు ఆర్‌ఐ ధ్రువీకరించాల్సి ఉంటుంది.

ఇందుకోసం ఆర్‌ఐకు ఇరవై రోజుల కిందట వెంకటేశ్వరరావు దరఖాస్తు చేసుకోగా రూ.10 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో రైతు అంత డబ్బు ఇవ్వలేనని బదులివ్వగా రూ.6 వేలైనా ఇవ్వాలని సూచించాడు. ఇదంతా ఫోన్‌లో రికార్డు చేయడంతోపాటు వీడియో చిత్రీకరించగా సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో బుధవారం ఆర్‌ఐ ధ్రువీకరణ పత్రంపై సంతకం చేసి ఆడియో, వీడియోలు తొలగించాలని కోరాడు. ఈ విషయమై ఆర్‌ఐని వివరణ కోరగా వాయిస్‌ రికార్డు చేస్తారని అనుకోలేదని, ఏదో అలా జరిగిపోయిందంటూ బదులివ్వడం గమనార్హం. ఇక తహసీల్దార్‌ ఎండీ.ముజాహిద్‌ మాట్లాడుతూ ఆర్‌ఐ డబ్బు డిమాండ్‌ చేసినట్లు తెలిసిందని, రైతు నుంచి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ఇవి చ‌ద‌వండి: వెళ్లిన నెల రోజులకే.. ఇంటికి తిరిగొచ్చిన శ‌వపేటిక‌!

Advertisement
 
Advertisement
Advertisement