శివాజీనగర: సిలికాన్ సిటీ అనగానే రోడ్లపై విపరీతమైన జన రద్దీ, కార్లు, బైక్లతో కిక్కిరిసిన రహదారులు మాత్రమే గుర్తుంటాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే నగరంలో సందడి తగ్గింది. శనివారం మరింతగా పడిపోయి నిశ్శబ్ధం తాండవించింది. వినాయక చవితితో కూడిన సుదీర్ఘ వారాంతం రావడమే కారణం. మూడురోజుల పాటు సెలవులు లభించాయి. దీంతో చాలామంది పండుగను సొంతూళ్లలో జరుపుకోవడానికి వెళ్లగా, మరికొందరు విహార యాత్రలకు తరలిపోయారు. కొందరు బంధువుల ఊళ్లకు ప్రయాణమయ్యారు.
సోషల్ మీడియాలో పోస్టింగులు
జన ప్రయాణంతో సందడిగా ఉండే బెంగళూరు రోడ్లు ఆకస్మాత్తుగా నిర్మానుష్యంగా మారాయి. నగరం మొత్తం నిశ్శబ్దంగా కనిపిస్తోంది. జనాలు లేని ఖాళీ రోడ్లను చూచి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఖాళీ రోడ్లను, పార్కులను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అలాగే ఊళ్లకు వెళ్లేవారి వీడియోలనూ షేర్ చేశారు.
తుమకూరు హైవే కిటకిట
సిటీ నుంచి సుమారు 20 జిల్లాలకు వెళ్లే తుమకూరు హైవే రహదారిపై వాహనాల రద్దీ తీవ్రంగా ఉంది. నవరంగ, యశ్వంతపుర, గొరగుంటపాళ్య, 8వ మైలు, దాసరహళ్ళి, నెలమంగళ టోల్ మరియు కుణిగల్ బైపాస్ వద్ద వాహనాలు బారులు తీరి కనిపించాయి. పని, చదువుల నిమిత్తం బెంగళూరులో ఉంటున్న విదార్థులు, వలస కూలీలు కూడా సొంత ఊళ్లకు తిరిగి వెళ్తుండటంతో రైళ్లు కిటకిటలాడాయి.
బెంగళూరులో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో విపరీతమైన రద్దీ
వరుస సెలవులతో ఊళ్లకు ప్రయాణం
సిటీలో తగ్గిన జనసందడి


