కోలారు: ప్రముఖ పుణ్యక్షేత్రం మాలూరు తాలూకాలోని చిక్కతిరుపతి శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి దేవాలయంలో శ్రావణ శనివారం, వీకెండ్ ఆదివారం కావడంతో రెండురోజులు భక్తజనం తరలివచ్చారు. తెల్లవారుజాము 3 గంటల నుంచే దేవాలయంలో అర్చకులు గోపాలకృష్ణ భరధ్వాజ్, శ్రీధర్ నేతృత్వంలో స్వామి వారికి అభిషేకం, పుష్పహారాలతో మనోహరంగా అలంకారం సాగించారు. తహసీల్దార్ రూపా సహా ప్రముఖులు స్వామి దర్శనం చేసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు.
ఆర్టీసీ బస్సు దగ్ధం
● విద్యార్థులు క్షేమం
గౌరిబిదనూరు: శనివారం సాయంత్రం గౌరిబిదనూరులో స్వాతంత్ర దినోత్సవాలలో పాల్గొని ఎం.గొల్లహళ్ళి, మరిపడుగు, జీలాకుంటె, జగరెడ్డి గ్రామాలకు సుమారు 40 మంది విద్యార్థులతో తిరిగి వెళ్తున్న కెఎ 40ఎఫ్ 1278 నంబరు గల కెఎస్ఆర్టీసీ బస్ కాలిపోయింది. ఎం.గొల్లహళ్ళి దగ్గర వెళ్తుండగా బస్సు ఇంజిన్లో నుంచి పొగలు వస్తుండడం చూసి డ్రైవర్ మోహన్, కండక్టర్ రమేశ్ రెడ్డి ఆపివేసి గట్టిగా కేకలు వేసి విద్యార్థులను హెచ్చరించారు. దీంతో అందరూ బస్సు దిగిపోయారు. కొంతసేపటికే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి బస్సు కాలిపోయింది. గౌరిబిదనూరు నుంచి ఫైర్ సిబ్బంది వెళ్లలోగా పూర్తిగా దగ్ధమైంది. అందరూ క్షేమంగా బయటపడడంతో ఊరిపి పీల్చుకున్నారు. విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు కలవరపడ్డారు. కండీషన్ లేని బస్సులను నడపడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, పాత బస్సులకు మరమ్మతులు చేయించి సరైన స్థితిలో ఉంచాలని డిమాండ్ చేశారు.
పవిత్రగౌడ బ్యారక్ బదిలీ
యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలు, నటి పవిత్రాగౌడను బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో సాధారణ బ్యారక్కు బదిలీ చేశారు. ఆమె ఇద్దరు మాత్రమే ఉండే బ్యారక్లో ఉండేది, ఇప్పుడు 16 మంది ఉండే గదికి తరలించారు. కోర్టులో విచారణ నడుస్తుండగా నిందితులందరూ వర్చువల్గా హాజరవుతున్నారు. 3 రోజుల క్రితం విచారణకు నిందితులందరూ హాజర్కాగా, పవిత్రాగౌడ ఆలస్యంగా తెర మీదకు వచ్చింది. ఇయర్ బడ్స్ కూడా ధరించింది. జడ్జి ఆమైపె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణాలతో బ్యారక్ బదిలీ జరిగినట్లు తెలిసింది.
రూ.2 కోట్ల ఉపకరణాల చోరీ, మాజీ ఉద్యోగుల అరెస్టు
దొడ్డబళ్లాపురం: ప్రైవేటు కంపెనీలో రూ.2 కోట్ల విలువైన కటింగ్ టూల్స్ చోరీ చేసిన 5 మంది మాజీ ఉద్యోగులను దొడ్డబళ్లాపురం గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. సోమశేఖర్, చంద్రశేఖర్,ఽ ధనుష్, నాగభూషణ్ , హరీష్ అరైస్టెనవారు. వీరి నుంచి రూ.80లక్షల విలువైన కటింగ్ టూల్స్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దొడ్డ పట్టణ పరిధిలో ఉన్న ప్రైవేటు కంపెనీలో గతంలో పని చేశారు. ఇటీవల కంపెనీలో కొన్ని ఉపకరణాలు కనిపించకపోవడంతో యజమానులు ఆరా తీయగా చోరీ అయినట్లు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా గుర్తించి అరెస్టు చేశారు.
కాలభైరవ దర్శనం
మండ్య: లోకాయుక్త జస్టిస్ బి.ఎస్. పాటిల్ ఆదివారం కుటుంబంతో కలిసి నాగమంగళ తాలూకాలోని ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని, పట్టణంలోని చారిత్రాత్మక శ్రీ సౌమ్య కేశవస్వామి ఆలయాన్ని సందర్శించారు. పాటిల్, సతీమణి శోభ మఠాధిపతి నిర్మలానందనాథ స్వామి ఆధ్వర్యంలో శ్రీ కాల భైరవేశ్వరస్వామి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. జిల్లా లోకాయుక్త ఎస్పీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


