శివాజీనగర: దేశంలో భారీ స్థాయిలో వైద్య విద్యను అందిస్తున్నారు, దేశంలోని 825 వైద్య కళాశాలల నుంచి ప్రతి సంవత్సరం 1.20 లక్షల మంది వైద్యులు, 90 వేల మంది పీజీ వైద్యులు పట్టాలతో వస్తున్నారని ప్రముఖ హృద్రోగ నిపుణుడు, బెంగళూరు రూరల్ ఎంపీ డాక్టర్ సీ.ఎన్.మంజునాథ్ అన్నారు. ఈ పరిస్థితుల్లో 2030 నాటికి వైద్యులు కూడా నిరుద్యోగులుగా మారతారని ఆయన చెప్పారు. బెంగళూరులో జరిగిన ఓ వైద్య సదస్సులో ఆయన ప్రసంగించారు. వైద్య రంగంలో భారీ మార్పు చోటు చేసుకుంటోందని, భారతదేశం ఔషధ ఉత్పత్తికి ప్రపంచ రాజధానిగా ఆవిర్భవిస్తోందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ప్రతి 4 జనరిక్ ఔషధాలలో ఒకటి భారతదేశంలో తయారవుతోందన్నారు. ఎఆర్ఐ, సిటీ స్కాన్ మిషన్లు, వెంటిలేటర్లు వంటి ఆధునిక ఉపకరణాలు మనదేశంలో ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. లక్షలాది మంది వైద్యులను తయారు చేస్తున్నప్పటికీ సరైన నియామకాలు లేకపోవడం వల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత ఉందని చెప్పారు. వైద్య రంగంలో కృత్రిమ మేధస్సుతో పాటు, మానవ మేధస్సును కూడా వివేకంతో ఉపయోగించాలన్నారు. వైద్య వనరులు ఎంత పెరిగినా, రాబోయే నాలుగేళ్లలో వైద్యులు కూడా కొంతమేర నిరుద్యోగులుగా ఉంటారని అన్నారు.
రూరల్ ఎంపీ డా.మంజునాథ్


