హైదరాబాద్‌ యువతి హత్య కేసు.. అపార్ట్‌మెంట్‌లో ఆ రోజు ఏం జరిగింది? | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ యువతి హత్య కేసు.. అపార్ట్‌మెంట్‌లో ఆ రోజు ఏం జరిగింది?

Jun 8 2023 8:16 AM | Updated on Jun 9 2023 8:28 AM

- - Sakshi

హైదరాబాద్‌కు చెందిన యువతి ఆకాంక్ష (23) హత్య కేసులో బెంగళూరు జీవన్‌ బీమానగర పోలీసులు ఆమె ప్రియుని కోసం అన్వేషణ చేపట్టారు. ఢిల్లీకి చెందిన అర్పిత్‌ (25) హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.

కర్ణాటక: హైదరాబాద్‌కు చెందిన యువతి ఆకాంక్ష (23) హత్య కేసులో బెంగళూరు జీవన్‌ బీమానగర పోలీసులు ఆమె ప్రియుని కోసం అన్వేషణ చేపట్టారు. ఢిల్లీకి చెందిన అర్పిత్‌ (25) హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. వివరాలు.. బీకాం పూర్తి చేసిన ఆకాంక్ష బెంగళూరులో మార్కెటింగ్‌ సంస్థలో పని చేసేది. ఢిల్లీకి చెందిన ఆర్పిత్‌ కూడా ఆకాంక్ష పని చేస్తున్న సంస్థలోనే ఉద్యోగంలో చేరాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి, ప్రేమకు దారి తీసింది. మొదట కొద్ది రోజులు ఒకే ఇంటిలో సహజీవనం చేశారు. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌కు అర్పిత్‌ బదిలీ కాగా, ఆ రూంను ఖాళీ చేసిన ఆకాంక్ష స్నేహితురాలితో కలిసి అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో బాడుగకు ఉంటోంది.

ఆత్మహత్య అనేలా నాటకం
ఈ నేపథ్యంలో ఇద్దరూ ఒకేచోట ఉద్యోగం చేయాలని, పెళ్లి విషయంలో విభేదాలు వచ్చాయి. హైదరాబాదు నుంచి వచ్చిన అర్పిత్‌ సోమవారం ఆకాంక్షతో కలిసి నగరంలో షికార్లు చేశాడు. మధ్యాహ్నం అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీనితో ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. తరువాత గొంతుకు చున్నీ బిగించి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ ఫ్యాన్‌కు వేలాడదీయలేక నేల మీద పడుకోబెట్టి ఫ్లాట్‌కి తాళం వేసుకొని పరారయ్యాడు. ఆకాంక్షతో పాటు అదే ఫ్లాట్‌లో ఉన్న స్నేహితురాలు కొన్ని గంటల తరువాత వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తల్లిదండ్రుల రాక
హైదరాబాద్‌ నుంచి తల్లిదండ్రులు, బంధువులు చేరుకుని విగతజీవిగా ఉన్న ఆకాంక్షను చూసి భోరున విలపించారు. తమ కూతురిని అర్పిత్‌ హత్య చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు జీవన్‌ బీమానగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement