కామారెడ్డి టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే) వాహనాలను సోమవారం డీఎంహెచ్వో వెంకటి తనిఖీ చేశారు. వాహ నాల కండిషన్తో పాటు వాటి పనితీరు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు, విద్యార్థులకు ఆర్బీఎస్కే ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది నిరంతరం కృషి చేయాలన్నారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు రాజుగౌడ్, రోహిత్, హెచ్ఈవో చలపతి తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్: వ్యవసాయ రంగంతో పాటు గృహ అవసరాలకు విద్యుత్ కష్టాలు లేకుండా చూస్తున్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ సలియా నాయక్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో 33/11 కేవీ సబ్స్టేషన్లో 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో అచ్చంపేట సర్పంచ్ లక్ష్మయ్య, ట్రాన్స్కో డీఈ, ఏడీ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల తాత్కాలిక మెరిట్ లిస్ట్ను విడుదల చేసినట్లు డీఎంహెచ్వో వెంకటి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు ల్యాబ్ టెక్నిషియన్, మూడు సీనియర్ ట్యూబర్క్యులోసిస్ ల్యాబోరేటరీ సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థుల అర్హతలు, మార్కులు, కేటగిరీల పూర్తి వివరాలతో కూడిన ఈ జాబితాను బుధవారం డీఎంహెచ్వో కార్యాలయ నోటీస్ బోర్డుతో పాటు, అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ జాబితాలో ఏవైనా తప్పులు లేదా ఆక్షేపణలు ఉంటే, అభ్యర్థులు తమ అర్జీలను తగిన ధ్రువీకరణ పత్రాలతో కలిపి ఈనెల 16వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కలెక్టరేట్లోని డీఎంహెచ్వో కార్యాలయం రూం నంబర్ 105లో సమర్పించాలని సూచించారు.
లింగంపేట: మహారాష్ట్రలోని పుణెలోగల శివఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహించిన పారా తైక్వాండో ఓపెన్ జాతీయ చాంపియన్షిప్ (క్యోరుగి – పుమ్సే)లో జిల్లా క్రీడాకారుడు సత్తా చాటాడు. లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ధారావత్ సాయిబాబా ద్వితీయ స్థానంలో నిలిచాడు. సోమవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరేందర్ క్రీడాకారుడిని సన్మానించారు. రాంపల్లి తండాకు చెందిన సాయిబాబాకు రెండు చేతులు చిన్నప్పుడే చచ్చుబడిపోయినా అకుంఠిత దీక్షతో సాధన చేసి జాతీయ స్థాయి తైక్వాండోలో సత్తా చాటాడని పేర్కొన్నారు. లెక్చరర్లు, తోటి విద్యార్థులు సాయిబాబాను అభినందించారు.
బాన్సువాడ : నియోజకవర్గంలోని సిద్దాపూర్ రిజర్వాయర్, జాకోరా ఎత్తిపోతల పథకం పనులపై సోమవారం హైదరాబాద్లో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురియడం లేదని, ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. సమీక్షలో ఇరిగేషన్ ఇన్చార్జి సీఈ దక్షిణామూర్తి, ఈఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


