కథలాపూర్: మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మహిళలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి సంఘ భవనాలున్నా.. మరుగుదొడ్లు లేక సమావేశాల వేళ ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం కొత్తగా మహిళ సంఘం భవనాలు నిర్మిస్తున్న చోట రెండు మరుగుదొడ్లు నిర్మించేందుకు అదనంగా నిధులు కేటాయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరా జ్శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
కొత్తగా 25 సంఘ భవనాలు
కథలాపూర్ మండలంలో 19 గ్రామాలుండగా, 33 మహిళ గ్రామైఖ్య సంఘాలున్నాయి. ఆరునెలల క్రితం 25 సంఘాలకు భవనాలు మంజూరయ్యాయి. ఒకో దానికి రూ. 10 లక్షల చొప్పున మంజూరై పలు గ్రామాల్లో పనులు సాగుతున్నాయి. పోసానిపేట, తుర్తి గ్రామాల్లో భవనాలు పూర్తయ్యాయి. కొత్తగా నిర్మిస్తున్న భవనాల వద్ద రెండు మరుగుదొడ్లు నిర్మించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటి నిర్మాణానికి రూ.1.25 లక్షలు కేటాయించారు. వీబీజీరాంజీ పథకం కింద రూ.87,500, పంచాయతీ రాజ్ నుంచి రూ.37,500 వెచ్చించాల్సి ఉంటుంది. .


