బంగ్లాదేశ్‌లో దారుణం.. భారత ఏజెంట్‌ అంటూ మహిళ జర్నలిస్ట్‌పై దాడి! | Woman Journalist Munni Saha Mobbed In Bangladesh's Dhaka | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో దారుణం.. భారత ఏజెంట్‌ అంటూ మహిళ జర్నలిస్ట్‌పై దాడి!

Dec 1 2024 5:05 PM | Updated on Dec 1 2024 5:18 PM

Woman Journalist Munni Saha Mobbed In Bangladesh's Dhaka

ఢాకా: బంగ్లాదేశ్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారతీయులు, హిందువులు, మైనార్టీలే టార్గెట్‌గా కొందరు దాడులు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా జర్నలిస్టును మూకుమ్మడిగా అడ్డుకుని వేధింపులకు గురి చేయడం కలకలం రేపింది. ఆమెను భారత ఏజెంట్‌ అంటూ దాడి చేసే ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌ను భారత్‌లో భాగం చేసేందుకు అన్ని విధాలా  ప్రయత్నిస్తున్నారంటూ  బంగ్లాదేశ్ సీనియర్ జర్నలిస్టు మున్నీ సాహాను కొందరు టార్గెట్‌ చేశారు. గుంపుగా వచ్చిన కొంతమంది.. ఢాకాలో ఆమెను చుట్టుముట్టారు. సాహా ఒక భారతీయ ఏజెంట్ అంటూ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారు అని వారు ఆరోపించింది. ఆమెపై దుర్భాషలాడుతూ దాడికి చేసేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో మహిళా జర్నలిస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరకు పోలీసులు.. ఆమెను రక్షించారు. అనంతరం, ఆమెను తేజ్ గావ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, మున్నీ సాహాను వేధించిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.  బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో హిందువులకు మద్దతుగా ఉద్యమించిన స్వామి చిన్మయ్ కృష్ణదాస్‌ను దేశద్రోహం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. బంగ్లా ప్రభుత్వ వైఖరిని భారత్‌ ప్రభుత్వం సైతం తప్పుపడుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement