హార్మూజ్ జలసంధిని స్వాదీనం చేసుకుంటాం
అక్కడ నౌకలపై సుంకాలు విధిస్తాం
ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమతో 60 రోజుల్లోగా తుది ఒప్పందం కుదుర్చుకోకపోతే హార్మూజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని, అక్కడ నౌకలపై సుంకాలు విధిస్తామని శనివారం తేల్చిచెప్పారు. ఇటీవల సంతకాలు జరిగిన అవగాహనా ఒప్పందం ప్రకారం.. హార్మూజ్ జలసంధిని ఇరాన్ బేషరతుగా తెరవాలని, రానున్న 60 రోజుల పాటు ఎలాంటి సుంకాలు లేకుండా నౌకల రాకపోకలకు వీలు కల్పించాలని వెల్లడించారు.
‘‘ఒకవేళ అమెరికా–ఇరాన్ మధ్య శాశ్వత ఒప్పందం కుదరని పక్షంలో.. 60 రోజుల గడువు ముగిసిన తర్వాత అమెరికా తరఫున విధిస్తే తప్ప హార్మూజ్లో ఎటువంటి సుంకాలు ఉండవు’’అని స్పష్టంచేశారు. ఇరాన్ తమ దారికి రాకపోతే హార్మూజ్ వారి(ఇరాన్) ఆ«దీనంలో ఉండదని ట్రంప్ సంకేతాలిచ్చారు. మధ్యప్రాచ్య దేశాలకు సంరక్షణ సేవలు అందించింనందుకు ఆ ఖర్చులను హార్మూజ్లో టోల్ ఫీజుల రూపంలో వసూలు చేసుకుంటామని వివరించారు.
హెజ్బొల్లాను అదుపు చేయాలి
లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ను తక్షణమే అదుపు చేయాలని ఇరాన్కు ట్రంప్ తేల్చిచెప్పారు. లేకపోతే ఇరాన్పై మళ్లీ సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ట్రూత్ సోషల్లో పోస్టుచేశారు. స్విట్జర్లాండ్లో అమెరికా–ఇరాన్ చర్చలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ట్రంప్ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. ‘‘ఇరాన్ అండదండలతో లెబనాన్లో ఇబ్బందులు సృష్టిస్తున్న మిలిటెంట్ గ్రూప్లను ఇరాన్ ప్రభుత్వం వెంటనే అదుపు చేయాలి. వారు(ఇరాన్) అందుకు అంగీకరించకపోతే గతవారం చేసినట్లే ఈసారి మరింత తీవ్రంగా ఇరాన్పై దాడి చేస్తాం’’ అని ట్రంప్ తేల్చిచెప్పారు.


