ఉక్రెయిన్ సైన్యం గురువారం మాస్కోపై భారీ ప్రతీకార దాడికి పాల్పడింది. రష్యాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అతి భారీ డ్రోన్ దాడి ఇదే. ఈ దాడిలో మాస్కోలోని కీలకమైన Kapotnya Oil Refinery తగలబడిపోయింది. ఈ రిఫైనరీ మాస్కోకు ఆయువుపట్టు లాంటిది.
ఈ దాడిలో రిఫైనరీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ రిఫైనరీ మాస్కో పెట్రోల్ అవసరాల్లో దాదాపు 40 శాతం, డీజిల్ అవసరాల్లో 50 శాతం వాటా కలిగి ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో రిఫైనరీ వద్ద భారీగా పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడిని సమర్థిస్తూ, ఇటీవల రష్యా కీవ్లోని చారిత్రక మఠ సముదాయంపై జరిపిన క్షిపణి దాడికి ప్రతీకార చర్యగా ప్రకటించారు. "ఉక్రెయిన్ కాలిపోతే మాస్కో కూడా కాలుతుంది. యుద్ధం ముగిసే సమయం వచ్చింది" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ దాడిపై రష్యా విదేశాంగ మంతి సెర్గీ లవ్రోవ్ స్పందిస్తూ, ఇకపై ఉక్రెయిన్పై క్రమం తప్పకుండా భారీ సమూహ దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు.
మరోవైపు రష్యా రాత్రికిరాత్రే దేశవ్యాప్తంగా 555 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించింది. అయితే కనీసం కొన్ని డ్రోన్లు రక్షణ వ్యవస్థలను దాటుకుని లక్ష్యాలను తాకినట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోని పలు విమానాశ్రయాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.
ఇదే సమయంలో రష్యా కూడా ఉక్రెయిన్పై 200కు పైగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఎదురుదాడులు కొనసాగించింది. దీంతో రెండు దేశాల మధ్య వైమానిక యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.


