వాషింగ్టన్: ఇరాన్ చిత్తుగా ఓడిపోతుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇరాన్ గెలుస్తోందని చెప్పడానికే మీడియా మొగ్గుచూపుతోంది. కానీ, వాస్తవానికి అందరికీ ఇరాన్ ఓడిపోతుందనే విషయం తెలుసని తెలిపారు.
“వారికి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, వారికి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థ లేదు, రాడార్ వ్యవస్థ పనిచేయడం లేదు, వారి క్షిపణి, డ్రోన్ కర్మాగారాలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. క్షిపణులు, డ్రోన్లు కూడా నాశనం అయ్యాయి. ముఖ్యంగా, ఎప్పటి నుంచో ఉన్న నాయకులు ఇక లేరు’ అని తెలిపారు.
సముద్రంలో ఇరాన్ మైన్లు వేసిన విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. అమెరికా ఇప్పుడు హార్మూజ్ జలసంధిని బాగు చేస్తోందని, ప్రపంచ దేశాలకు సాయంగా ఈ పని చేస్తున్నామని అన్నారు.
మరోవైపు, అమెరికా, ఇరాన్ మధ్య పాకిస్థాన్లో జరుగుతున్న చర్చలు కొన్ని భేదాలు, ముందస్తు షరతుల వల్ల ఆలస్యమయ్యాయయని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, చర్చలు 5 గంటలకుపైగా ఆలస్యమయ్యాయని, ఆ తర్వాత అధికారికంగా ప్రారంభమయ్యాయని ట్రంప్ చెప్పారు. ఇరాన్ యుద్ధం వేళ ఎరువుల ధరలను నిశితంగా గమనిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మార్కెట్ను నియంత్రిస్తూ ధరలను అధికంగా పెంచడాన్ని అమెరికా అంగీకరించదని చెప్పారు.
కాగా, ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ బృందానికి ఆ దేశ స్పీకర్ మహమ్మద్ బేర్ గలీబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు.
చర్చలలో అమెరికాకు ఇరాన్ ప్రతిపాదనలు ఇవే..
- ఇరాన్పై దురాక్రమణ చేయొద్దు
- హార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగించడానికి అంగీకరించడం
- అన్ని ప్రాథమిక ఆంక్షలను ఎత్తివేయడం
- అన్ని ద్వితీయ ఆంక్షలను ఎత్తివేయడం
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలన్నింటినీ రద్దు చేయడం
- IAEA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలన్నింటినీ రద్దు చేయడం
- ఇరాన్కు నష్టపరిహారం చెల్లించడం
- ఈ ప్రాంతం నుంచి అమెరికా సైనికదళాలను ఉపసంహరించుకోవడం
- లెబనాన్పై దాడులు విరమించుకోవడం


