ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఒకవైపు కామాంధుడి పాశవిక చర్య, మరోవైపు పోలీసుల ఉదాసీనత, ఆపై ఆసుపత్రుల అమానవత్వం.. మొత్తంగా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ ఉదంతంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది.
మార్చి 16న జరిగిన ఈ దారుణ ఘటనలో చిన్నారి ప్రైవేట్ భాగాల్లో వస్తువులు జొప్పించి, హింసించినట్లు పోస్ట్మార్టం నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ ఉదంతంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా, అందులో కనీసం ‘పోక్సో’ సెక్షన్లను చేర్చకపోవడంపై సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని చూసి కూడా.. ఖజన్ సింగ్ మాన్వీ హెల్త్ కేర్, సెయింట్ జోసెఫ్ ఆస్పత్రులు చేర్చుకోకపోవడంతో సకాలంలో వైద్యం అందక ఆ చిన్నారి కన్నుమూసింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వ్యవస్థే మృత్యువుకు దారి చూపడం అమానవీయమని సుప్రీం కోర్టు మండిపడింది. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన ఆసుపత్రులకు కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. ఏప్రిల్ 13న ఘజియాబాద్ పోలీస్ కమిషనర్, నంద్గ్రామ్ ఎస్హెచ్ఓ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లేదా కేంద్ర సంస్థకు అప్పగించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది.‘న్యాయం అంటే కేవలం తీర్పు చెప్పడమే కాదు.. బాధ్యతను గుర్తు చేయడం కూడా’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఇది కూడా చదవండి: స్టూడెంట్ డెత్ మిస్టరీ: పార్టీ చేసుకుందామని పిలిచి..


