ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈ మధ్యే రెండు వారాల కాల్పుల విరమణని ట్రంప్ ప్రకటించారు. అది ప్రస్తుతం అమల్లో ఉంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించారు. ఆర్థడాక్స్ ఈస్టర్ పండగని పురస్కరించుకుని ఈ ప్రకటన చేశారు.
క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఏప్రిల్ 11న సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్ 12వ తేదీ ముగింపు వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో అన్ని దిశల్లో సైనిక చర్యలని నిలిపివేయాలని రష్యా సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. కానీ శత్రువుల నుంచి ఎలాంటి దాడులు జరిగినా దానికి తగినట్లే ప్రతిస్పందించడానికి సైన్యం సిద్ధంగా ఉందని కూడా స్పష్టం చేసింది. ఇదే విధంగా ఉక్రెయిన్ కూడా సీజ్ ఫైర్ పాటిస్తుందని రష్యా ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ.. అమెరికా ద్వారానే ఈస్టర్ సందర్భంగా కాల్పుల విరమణకు సంబంధించిన ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్వర్యంలో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ సఫలమయ్యాయి. భూభాగం, రాజకీయపరమైన రాయితీలు ఇవ్వాలని రష్యా పట్టుబడుతుండగా వాటికి ఉక్రెయిన్ తిరస్కరిస్తోంది. అందుకే 2022లో ఈ యుద్ధం మొదలైనప్పటికీ ఇప్పటికీ ఎటూ తేలట్లేదు. దీని కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు.


