
ఇరాన్ (Iran)లోని మూడు అణుకేంద్రాలు లక్ష్యంగా అమెరికా (USA) ఆదివారం(జూన్ 22న) ప్రత్యక్షంగా దాడులు చేసిందన్నది తెలిసిందే. అయితే, ఈ దాడుల్లో ఇరాన్కు జరిగిన నష్టం గురించి పెంటగాన్కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) ఓ నివేదిక తయారుచేసింది. ఈ నివేదికల్లోని విషయాలు పలు మీడియాల్లో కథనాలుగా వెలువడగా.. ఇప్పుడవి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఈ నివేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అవి నకిలీ వార్తలని పేర్కొన్న ఆయన.. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించే ప్రయత్నం ఇదన్నారు. ‘నకిలీ వార్తలు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించేందుకు కొన్ని వార్తా సంస్థలు చేస్తున్న ప్రయత్నం ఇది. ఆయా వార్తా సంస్థలను ప్రజలు నమ్మడం లేదు. ఇరాన్లోని అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయి’ అని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు.
అయితే, ఇంటెలిజెన్స్ నివేదికలోని అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. యూఎస్ దాడుల్లో ఇరాన్కు పరిమితంగా నష్టం వాటిల్లిందని అందులో తెలపడం గమనార్హం. ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై బీ-2 స్పిరిట్ బాంబర్లతో అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఆయా అణుకేంద్రాలు నాశనం అయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump), రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) ప్రకటించారు. అయితే, ఇంటెలిజెన్స్ నివేదికలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి.
మూడు అణుకేంద్రాలు లక్ష్యంగా దాడులు చేయగా అందులో ఫోర్డో, నతాంజ్లు పూర్తిగా నాశనం కాలేదని నివేదికలో పేర్కొంది. యురేనియం శుద్ధి చేసేందుకు ఉపయోగించే సెంట్రిఫ్యూజ్లు వంటి కీలక పరికరాలను ఇరాన్ కొన్ని నెలల్లోనే తిరిగి పునఃప్రారంభించుకోవచ్చని తెలిపింది. అంతేకాదు.. దాడులకు ముందే భారీగా శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ రహస్య ప్రాంతానికి తరలించినట్లు అందులో పేర్కొంది.
అయితే ఈ సందర్భంగా ఫోర్డో కేంద్రం గురింంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది దాదాపు 150–300 అడుగుల గట్టిగా ఉన్న పర్వతాల కింద నిర్మించబడిన సురక్షితమైన సైట్. అందుకే, US సైన్యం ఉపయోగించిన ‘బంకర్ బస్టర్’ పేలుడు బాంబులు కూడా దీన్ని పూర్తిగా నాశనం చేయలేకపోయినట్టు Pentagon నివేదిక పేర్కొంది. US బాంబర్లు 12 గుబు-57 బాంబులు ఫోర్డోపై, మరికొన్ని నతాంజ్పై వేయగా, US నేవీ సబ్మరిన్ ఇస్ఫహాన్పై దాదాపు 30 టోమాహాక్ క్షిపణులు ప్రయోగించింది.
ఇక, బయటకు వచ్చిన ఈ నివేదికలను వైట్హౌస్ (White House) ధ్రువీకరించినప్పటికీ.. అందులోని అంశాలను కొట్టిపారేసింది. ‘ఇలాంటి ఆరోపణలతో కూడిన నివేదికలను లీక్ చేయడం అధ్యక్షుడు ట్రంప్ను కించపరచడమే. ఇరాన్ అణుకార్యక్రమాన్ని నిర్మూలించిన యుద్ధపైలట్ల ధైర్యసాహసాలను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నం ఇది. 30 వేల పౌండ్లు కలిగిన 14 బాంబులను కచ్చితమైన లక్ష్యాలపై వేస్తే ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు. అవన్నీ మొత్తం ధ్వంసం అయ్యాయి’ అని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ ఎక్స్లో పేర్కొన్నారు.
“Everyone knows what happens when you drop fourteen 30,000 pound bombs perfectly on their targets: total obliteration.” - LEAVITT https://t.co/a6zCgFnheq
— Aishah Hasnie (@aishahhasnie) June 24, 2025
మరోవైపు.. సైనిక చర్యతో ఇరాన్ నుంచి అణు ముప్పు తొలగించినట్లు కాల్పుల విరమణ ఒప్పంద ప్రకటన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా బాంబర్ల దాడుల్లోనూ ఇరాన్ అణు కేంద్రాలకు పరిమిత నష్టం వాటిల్లిందన్న నిఘా నివేదికలపై మరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి!.