
జపాన్ ‘బాబా వంగా’జోస్యం
గతంలో చెప్పినవన్నీ నిజమైన వైనం
డయానా మృతి గురించి ముందే చెప్పారు
2011 సునామీ, కరోనా గురించి కూడా
సునామీ. మూడక్షరాలే అయినా, అది సృష్టించే విధ్వంసం ఎంతటిదో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. 2004లో విరుచుకుపడ్డ సునామీ బీభత్సాన్ని ప్రపంచం ఎన్నిటికీ మర్చిపోలేదు. అనంతరం 2011లో భారీ సునామీ జపాన్ మొదలుకుని పలు దేశాలను అతలాకుతలం చేసేసింది. అలాంటి ఉత్పాతం మరోసారి వచ్చి పడితే? అది కూడా 2011, 2004ల్లో కంటే ప్రళయభీకర స్థాయిలో వస్తే? అదే జరగవచ్చట.
అది కూడా ఎప్పుడో కాదు, వచ్చే జూలైలోనే! దాని తీవ్రత జపాన్ చరిత్రలోనే కనీ వినీ ఎరగని విధంగా ఉంటుందట. ఈ మేరకు జపాన్కు చెందిన ప్రఖ్యాత మాంగా ఆర్టిస్టు ర్యో తత్సుకీ చెప్పిన జోస్యం ఇప్పుడు చాలామందిని తీవ్రంగా కలవరపెడుతోంది. 2011 సునామీతో పాటు ఆమె గతంలో చెప్పినవెన్నో అక్షరాలా జరగడమే ఇందుకు కారణం. ఆ జాబితాలో 2020 నుంచి రెండేళ్లకు పైగా ప్రపంచానికి నిద్ర కూడా లేకుండా చేసిన కరోనా కూడా ఉంది!
ఏమిటీ మాంగా?
మాంగా అంటే జపాన్కే ప్రత్యేకమైన నవలలు, కార్టూన్లు. 70 ఏళ్ల తత్సుకీ ఈ కళలో ఆరితేరారు. పైగా ఇలస్ట్రేటర్గా కూడా ఆమెకు చాలా పేరుంది. అంతకుమించి భవిష్యద్రష్టగా కూడా తత్సుకీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. 1980ల నుంచీ ఆమె భవిష్యత్తు చెబుతున్నారు. ప్రిన్సెస్ డయానా మరణాన్ని కూడా ముందే చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘నేను చూసిన భవిష్యత్తు (ద ఫ్యూచర్ దట్ ఐ సా)’పేరిట 1999లో ఆమె రాసిన మాంగా రేపిన దుమారం అంతా ఇంతా కాదు.
సమీప భవిష్యత్తులో వచి్చపడనున్న ఎన్నెన్నో ప్రాకృతిక విపత్తులను గురించి అందులో తత్సుకీ ముందే పేర్కొన్నారు. ముఖ్యంగా 2011 మార్చి 11న ఏకంగా 9.1 తీవ్రతతో జపాన్ను కుదిపేసిన భయానక భూకంపం, దాని ఫలితంగా వచి్చపడ్డ భీకర సునామీ ధాటికి ఏకంగా 20 వేల మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతం గురించైతే తత్సుకీ అత్యంత స్పష్టంగా పేర్కొన్నారు. ‘2011లో భారీ ఉత్పాతం వచ్చి పడనుంది’అంటూ ఓ అధ్యాయమే రాశారు. అంతేకాదు, ‘2020లో అంతుపట్టని కొత్త రకం వైరస్ వ్యాప్తి పరాకాష్టకు చేరుతుంది’అంటూ మరోచోట కరోనా గురించి కూడా స్పష్టంగా పేర్కొన్నారు.
రాకాసి బుడగలు
వచ్చే జూలైలో మెగా సునామీ రాబోతోందన్న తత్సుకీ, అది జపాన్ చరిత్రలోనే కనీవినీ ఎరగనంత తీవ్రమైనదని కూడా రాశారు. దాని ధాటికి జపాన్, తైవాన్, ఇండొనేసియా, ఉత్తర మరియానా దీవులు అతలాకుతలమైపోతాయని హెచ్చరించారు. ఆ దేశాలను అనుసంధానించే వజ్రాకృతితో కూడిన జోన్ నిండా ‘రాక్షస బుడగలు (రాకాసి అలలు) పడగలెత్తుతాయి’, ‘దక్షిణ జపాన్ సముద్రం మరిగిపోతుంది’అంటూ రాబోయే సునామీ తీవ్రతను వర్ణి0చారు.
అంతేకాదు, దాని తీవ్రత 2011 నాటి సునామీ కంటే కనీసం మూడు రెట్లకు పై చిలుకేనని స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపై కొద్ది రోజులుగా ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. ఈ జోస్యం ఏ మేరకు నిజమవుతుందన్న దానిపై ఎవరి అంచనాల్లో వారున్నారు. గత 20 ఏళ్లలో తత్సుకీ చెప్పినవన్నీ జరిగినప్పుడు ఇది మాత్రం ఎందుకు జరగదని వాదించే వారు కొందరు.
సునామీ వంటి ప్రాకృతిక విపత్తుల విషయంలో శాస్త్రీయ అంచనాలను నమ్ముకోవాలే తప్ప ఇలాంటి జోస్యాలను కాదని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. చూడబోతే మాంగా పేరిట తత్సుకీ ఏకంగా ప్రపంచం పాలిట మరణశాసనమే రాసినట్టు కని్పస్తోందంటూ ఇంకొందరు వాపోతున్నారు. తన రాతలపై ఇంత దుమారం రేగుతున్నా 70 ఏళ్ల తత్సుకీ మాత్రం వాటిపై మౌనం వీడటం లేదు. గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’అంటూ కీర్తిస్తున్నారు. అంధురాలైన బాబా వంగా కూడా ఇలాగే జరగబోయే విషయాలను ముందుగానే చెప్పి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.
కొసమెరుపు
కరోనాకు సంబంధించి మనందరినీ మరింత వణికించేలా మరో జోస్యం కూడా చెప్పారు తత్సుకీ! అదేమిటో తెలుసా? మరో అయిదేళ్లలో అంటే 2030లో అది మరింత తీవ్రతతో వచ్చి పడుతుందట.
– సాక్షి, నేషనల్ డెస్క్