1945 ఆగస్టు 6: హిరోషిమాపై అణుబాంబు విధ్వంసం
సందర్భం
1945 ఆగస్టు 6 ఉదయం 8:15 గంటలకు హిరోషిమాలో ఉదయపు హడావుడి మొదలైంది. వీధుల్లో కార్లు శబ్దం చేస్తూ వెళ్తున్నాయి, ఆఫీసు ఉద్యోగులు తమ బల్లల వద్ద కుదురుకుంటున్నారు, పిల్లలు పాఠశాలలకు సిద్ధమవుతున్నారు. అంతలోనే, ఒక్క క్షణంలో, సూర్యుడి కంటే అత్యంత ప్రకాశవంతమైన కాంతి నగర మంతటా వ్యాపించింది. ఒక అమెరికా బి–29 బాంబర్ ‘ఎనోలా గే’ ప్రపంచంలోనే తొలి సారిగా అణుబాంబును జారవిడిచింది. ఆకాశంలోకి మష్రూమ్ క్లౌడ్ (పుట్టగొడుగు లాంటి పొగ) ఎగిసిపడటంతో క్షణాల్లో పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1945 చివరి నాటికి, పేలుడు, తీవ్రమైన కాలిన గాయాలు, రేడియేషన్ కారణంగా సుమారు 1,40,000 మంది మరణించారు.
ఆ బాంబు దాడిని ప్రత్యక్షంగా చూసిన వారిలో తమేతో ఉఎమోరి ఒకరు. అప్పట్లో 40 ఏళ్ల వయసున్న ఉఎమోరి, మరుసటి రోజు తన కుటుంబ సభ్యుల కోసం శిథిలాలలో వెతకడం ప్రారంభించారు. ఆ క్రమంలో, గాయపడిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. ఆయన ఎటు చూసినా ఊహకు అందని దారుణ దృశ్యాలే: గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన జనాలు, నీళ్ల కోసం అరుస్తున్న బాధితులు, బూడిదగా మారిన పొరుగు ప్రాంతాలు. మరణించిన వారి దేహాలపై ఈగలు, పురుగులు ముసురుకోవడం ప్రారంభించాయని ఉఎమోరి 1987లో తన 88వ ఏట ‘అసోసియే టెడ్ ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఆ బాంబు దాడిలో తన తమ్ముడితో సహా సొంత కుటుంబ సభ్యులు మరణించారని ఆయన చివరికి తెలుసుకున్నారు. ఆ జ్ఞాపకాలు ఆయనను ఎన్నడూ వదల్లేదు.
దుఃఖం నుంచి పోరాటానికి...
హిరోషిమా అనుభవించిన ఘోరాన్ని మరెవరూ అనుభవించ కుండా చూడటానికి ఉఎమోరి తన మిగిలిన జీవితాన్ని అంకితం చేశారు. అణు బాంబు దాడుల నుండి ప్రాణాలతో బయటపడిన అనేకమంది ’హిబాకుషా’లలో ఒకరిగా మారారు. వీరు తమ వ్యక్తి గత విషాదాన్ని అణు ఆయుధాలకు వ్యతిరేకంగా జీవితకాల పోరా టంగా మార్చుకున్నారు. తదనంతరం మరణించిన ఉఎమోరి, 1987 నాటి తన ఇంటర్వ్యూలో, అణు నిరాయుధీకరణ గురించి ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. అది నేటికీ అత్యంత అత్యవసరమైనది. విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన మరొక వ్యక్తి శాండ్ఫోర్డ్ జెడ్. పర్సన్స్. రెండవ ప్రపంచ యుద్ధంలో యు.ఎస్. నేవీలో పనిచేశారు. బాంబు దాడి జరిగిన నాలుగు నెలల తర్వాత ఆయన హిరోషి మాలో పనిచేస్తున్నప్పుడు, తాను ఊహించినదానికి భిన్నమైన విధ్వంసాన్ని చూశారు. నగరంలోని అనేక ప్రాంతాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఆ అనుభవం పర్సన్స్ను వెంటాడింది. చివరికి శాంతి కోసం తనను అంకితం చేసుకున్నారు. వరల్డ్ ఫెడరలిస్ట్ మూవ్మెంట్ డైరెక్టర్గా మారి, 1984లో మరణించే వరకు అణు ఆయుధాల ముప్పును తగ్గించే అంతర్జాతీయ ఒప్పందాల కోసం పోరాడారు. ఒకరు జపనీస్, మరొకరు అమెరికన్. వారు చరిత్రలోనే అత్యంత విధ్వంసకర యుద్ధంలో పరస్పరం వ్యతిరేక దిశల్లో నిలబడ్డారు. అయినప్పటికీ, మానవాళి భవిష్యత్తు అణు ఆయు ధాలు మళ్లీ ఎప్పటికీ ఉపయోగించకుండా చూడటంపైనే ఆధారపడి ఉంటుందని ఇద్దరూ నమ్మారు.
ఆయుధం వర్సెస్ ఆహారం
యునైటెడ్ స్టేట్స్ 1945 ఆగస్టు 6న హిరోషిమాపై, మూడు రోజుల తర్వాత ఆగస్ట్ 9న నాగసాకిపై మరో అణు బాంబునువేసింది. రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించడానికి ఈ దాడులు అవసరమా లేదా జపాన్ ను ఇతర మార్గాల ద్వారా లొంగిపోయేలా చేయవచ్చా అనే దానిపై చరిత్రకారులు ఇప్పటికీ విశ్లేషిస్తూనే ఉన్నారు. అయితే వివాదానికి తావులేని విషయం ఏమిటంటే, ఆ బాంబు దాడులు అణు ఆయుధాల అసమాన విధ్వంసక శక్తిని నిరూపించాయి. మానవాళి వెనక్కి రాలేని ఒక తీవ్రమైన సరిహద్దును దాటేసింది. హిరోషిమా, నాగసాకిలను నాశనం చేసిన బాంబులు ఆధు నిక ప్రమాణాలతో పోలిస్తే ప్రాథమికమైనవి (చిన్నవి). నేటి అణు ఆయుధాలు అంతకంటే విధ్వంసకరమైనవి. ఆర్మ్స్ కంట్రోల్ అసో సియేషన్ ప్రకారం, ప్రపంచంలోని అణుశక్తి దేశాలు సంయుక్తంగా 12,000 కంటే ఎక్కువ అణు ఆయుధాలను కలిగి ఉన్నాయి. చాలా వరకు హిరోషిమాను నాశనం చేసిన బాంబు కంటే ఎంతో శక్తిమంత మైనవి. ఒకే ఒక ఆధునిక థర్మోన్యూక్లియర్ ఆయుధం ఒక మహా నగరాన్నే తుడిచిపెట్టగలదు.
ఐరిష్ రచయిత పాట్రిక్ కమర్ఫోర్డ్ మరో ముఖ్యమైన కోణాన్ని ప్రస్తావించారు. ఒక్క అణు క్షిపణికి అయ్యే ఖర్చుతో వేలాదిమంది పిల్లలకు ఆహారం, స్వచ్ఛమైన నీరు, మందులను అందించవచ్చని ఆయన అన్నారు. అణు ఆయుధాలను ఎప్పటికీ ప్రయోగించక పోయినా అవి భారీ ఖర్చును మోపుతాయి. ఆయుధాగారాలను నిర్వహించడానికి, ఆధునికీకరించడానికి ప్రభుత్వాలు అపారమైన నిధులను వెచ్చిస్తాయి. అణు నిల్వలను విస్తరించడానికి వెచ్చించే ప్రతి రూపాయి ప్రజారోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు లేదా శాస్త్రీయ పరిశోధనలకు లభించకుండా పోతుంది.
ఒప్పందాలతోనే శాంతి
భద్రత ముఖ్యమైనదే. రక్షణ గురించి దేశాలకు ఆందోళనలు ఉంటాయి. అయితే ఆయుధ నియంత్రణ ఒప్పందాలు ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మార్చాయని చరిత్ర నిరూపిస్తోంది. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) అణు ఆయుధాల వ్యాప్తిని పరిమితం చేయడానికి సహాయపడింది. కోల్డ్ వార్ కాలంలో వాషింగ్టన్, మాస్కో మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు వేలాది అణు ఆయుధాలను నిర్మూలించాయి. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఆయుధాగారాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రమాదాన్ని తగ్గించే విషయంలో అవే అత్యధిక బాధ్యత వహించాలి. ఉక్రెయిన్ యుద్ధం, ఇతర ప్రాంతీయ సంక్షోభాలను పరిష్కరించే ప్రయత్నా లతో పాటు ఈ శక్తుల మధ్య తీవ్రమైన చర్చలు జరగాలి. చరిత్రలో ఆయుధ నియంత్రణ విజయవంతమైంది దేశాలు ఒకరినొకరు నమ్మడం వల్ల కాదు, ఉమ్మడి ముప్పు సహకారాన్ని కోరుతుందనే విషయాన్ని గుర్తించడం వల్లనే!
హిరోషిమాను ప్రత్యక్షంగా చూసిన తరం వేగంగా కనుమరుగ వుతోంది. 1945 నాటి ఆ ఆగస్టు రోజున తాము ఏమి చూశారో వివ రించగలిగే బాధితులు త్వరలోనే ఎవరూ ఉండరు. మిగిలేది వారి మాటలు, వారి హెచ్చరికలు, వారు మనకు వదిలివెళ్లే బాధ్యత మాత్రమే. తమేతో ఉఎమోరి తన జీవితాంతం ప్రపంచాన్ని హిరోషిమాను గుర్తుంచుకోమని కోరింది అది కేవలం చరిత్ర అని కాదు. ఆయన జీవించిన చరిత్ర మళ్లీ పునరావృతం కాకూడదని! హిరోషిమా అణుబాంబు దాడి రోజు కేవలం జ్ఞాపకార్థ దినం మాత్రమే కాకూడదు. ఇది ‘నిరాయుధీకరణ దినోత్సవం’ కావాలి. ప్రభుత్వాలు అణు ప్రమాదాలను తగ్గించడానికి అంకితం చేసుకునే రోజు, సాధారణ పౌరులు అలా చేయాలని డిమాండ్ చేయడానికి పునరంకితం అయ్యే రోజు కావాలి. బాధితులు ఇప్పటికే తమ సాక్ష్యాన్ని ప్రపంచానికి అందించారు. మనం దానికి అనుగుణంగా స్పందిస్తామా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది.
విలియమ్ ల్యాంబర్స్
వ్యాసకర్త ‘ద రోడ్ టు పీస్’ రచయిత
(‘ద జపాన్ టైమ్స్’ సౌజన్యంతో)


