నోరు పారేసుకున్న మునీర్‌ | Pakistan Army Chief Asim Munir Sensational Comments Against India | Sakshi
Sakshi News home page

నోరు పారేసుకున్న మునీర్‌

Aug 11 2025 9:00 AM | Updated on Aug 12 2025 6:03 AM

Pakistan Army Chief Asim Munir Sensational Comments Against India

న్యూయార్క్‌:  పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అసిమ్‌ మునీర్‌ మరోసారి రెచి్చపోయారు. ప్రస్తుతం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన భారత్‌పై నోరుపారేసుకున్నారు. భారత సైన్యం గనుక పాకిస్తాన్‌పై దాడి చేస్తే తాము నష్టపోవడం కాకుండా సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని గుర్తుచేశారు. 

శనివారం ఫ్లోరిడాలోని టాంపా పట్టణంలో ప్రవాస పాకిస్తానీల సమావేశంలో మాట్లాడారు. కాశ్మీర్‌ అంశాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. కాశ్మీర్‌ అనేది పాకిస్తాన్‌కు ‘తల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే సిర’ లాంటిదని చెప్పారు. తమ దేశానికి రావాల్సిన నీటిపై హక్కులను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జల హక్కులకు కాపాడుకుంటామన్నారు. 

ఇటీవల భారత్‌–పాక్‌ మధ్య ఘర్షణలో తాము పైచేయి సాధించమని వ్యాఖ్యానించారు. భారత్‌ మరోసారి దాడిచేస్తే తగిన సమాధానం చెప్తామన్న సందేశం ఇచ్చామని పేర్కొన్నారు. కాశ్మీర్‌ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారం కాదని, అది పూర్తిగా అంతర్జాతీయ ఎజెండా అని తేల్చిచెప్పారు. పాకిస్తాన్‌కు కాశ్మీర్‌ అత్యంత కీలకమని మహ్మద్‌ అలీ జిన్నా చెప్పారని గుర్తుచేశారు.   
  


సింధూ నది ఇండియా జాగీర్‌ కాదు  
తమ దేశానికి నీరు రాకుండా ఎగువన భారత్‌ గనుక డ్యామ్‌లు నిర్మిస్తే వాటిని కచ్చితంగా పేల్చేస్తామని అసిమ్‌ మునీర్‌ హెచ్చరించారు. డ్యామ్‌లు నిర్మించేదాకా వేచి చూస్తామని, వాటి నిర్మాణం పూర్తయ్యాక ధ్వంసం చేస్తామని అన్నారు. సింధూ నది ఇండియా జాగీర్‌ కాదని స్పష్టంచేశారు. అది సొంత ఆస్తిలాగా భావించొద్దని ఇండియాకు సూచించారు. నదులకు అడ్డుకట్ట వేయాలని చూస్తే అడ్డుకొని శక్తి తమకు ఉందన్నారు.

 పాకిస్తాన్‌–అమెరికా మధ్య సంబంధాలు నానాటికీ బలపడుతున్నాయని మునీర్‌ హర్షం వ్యక్తంచేశారు. నెలన్నర వ్యవధిలోనే తాను మరోసారి అమెరికాకు రావడమే అందుకు నిదర్శనమని తెలిపారు. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య యుద్ధాన్ని అపేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మునీర్‌ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement