Not Like Seema Haider, Will Return to India: Woman Who Went to Pak for Love - Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్‌కు.. అంజూ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌!

Published Mon, Jul 24 2023 4:50 PM

Not like Seema Haider Will Return To India: Woman who went to Pak for love - Sakshi

ప్రేమకు హద్దులు ఉండవని అంటుంటారు. అందుకేనేమో ప్రేమించిన వారి కోసం ఏకంగా దేశాలు దాటుతున్నారు. కుటుంబాన్ని, ఉన్న ఊరును  విడిచి ప్రేయసి, ప్రియుడు కోసం దారులు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నారు ప్రేమ పావురాలు. సోషల్‌ మీడియా వినియోగంతో ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువవుతున్నాయి. పబ్జీ ప్రేమ  ఓ మహిళను పాకిస్తాన్ నుంచి ఇండియాకు రప్పిస్తే..ఫేస్బుక్ ప్రేమ మరో మహిళను భారత్ నుంచి పాకిస్థాన్కు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

అయితే రాజస్థాన్‌కు చెందిన అజు అనే మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయమైన ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి పాక్‌స్థాన్‌కు వెళ్లిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. తనపై మీడియాలో వస్తున్న వార్తలపై అంజూ స్పందించింది. ప్రస్తుతం ఆమె పాకిస్థాన్‌లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. తను కేవలం సందర్శన కోసమే పాకిస్థాన్‌ వచ్చిన్నట్లు పేర్కొంది. పాక్‌లో ఓ పెళ్లి ఉందని, దానికి హాజరు అయ్యేందుకు వచ్చానని తెలిపింది. ఇందుకు అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించినట్లు చెప్పింది.

మూడేళ్లుగా పరిచయం
తన పాకిస్థాన్‌ రాకపై ఎవరికీ ఏం తెలియదని, తన భర్తతో జైపూర్‌కు వెళ్తున్నట్లు చెప్పినట్లు తెలిపింది. ‘ముందుగా భివాడి నుంచి ఢిల్లీకి వచ్చాను. తర్వాత అమృత్‌సర్‌కు వెళ్లాను. ఆ తర్వాత వాఘా బోర్డర్‌కు వెళ్లి అక్కడి నుంచి పాకిస్థాన్‌లోకి అడుగుపెట్టాను. ఇక్కడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. తన పేరు నస్రుల్లా. మేం ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితులం. తను రెండుమూడేళ్లేగా నాకు తెలుసు. ఈ విషయం మా అక్క, అమ్మలకు కూడా తెలుసు.  మా రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయి.

సీమా హైదర్‌తో పోల్చకండి
కేవలం పెళ్లి కోసమే వచ్చాను. నాకు ఇక్కడ ఇంకేం పని లేదు. నన్ను సీమా హైదర్‌తో పోల్చకండి.. నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. నస్రుల్లాను పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. త్వరలోనే తిరిగి భారత్‌ వస్తాను. నా భర్తకు నాకు మనస్పర్థలు తలెత్తాయి. నా భర్త నుంచి విడిపోయి.. పిల్లలతో కలిసి నివసించాలనుకుంటున్నాను’ అని తెలిపింది.
సంబంధిత వార్త: ఆమెకు పిల్లలున్నా పాక్‌ యువకుడితో ప్రేమ.. అతడి కోసం సరిహద్దు దాటి..  

పెళ్లి చేసుకునే ఆలోచన లేదు
మరోవైపు అంజూ ఆగస్టు 20న భారత్‌కు రానుందని ఆమె పాకిస్థాన్‌ స్నేహితుడు నస్రుల్లా(29) తెలిపాడు. అంజూ తనకు కేవలం స్నేహితురాలు మాత్రమేనని, వారి మధ్య ప్రేమ లేదని పేర్కొన్నాడు. ఆమె పాకిస్థాన్‌కు పర్యటనకు వచ్చిందని, ఆమెను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తెలిపాడు. ఆమె వీసా గడువు ఆగస్టు 20న ముగియనుండటంతో అప్పుడే భారత్‌కు తిరిగి వెళ్లనుందని చెప్పాడు. ఆమె తన ఇంట్లోనే వేరే గదిలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుందని తెలిపాడు.

2019లో పరిచయం
కాగా ఉత్తరప్రదేశ్‌లోని కైలోర్‌కు చెందిన అంజూ రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో నివాసముంటోంది. ఈమెకు  అరవింద్‌ అనే వ్యక్తితో 2007లో వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ల బాలిక, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అంజు ప్రస్తుతం.. ప్రైవేట్ సంస్థలో బయోడేటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లాతో 2019లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది.

వాలిడ్‌ పాస్‌పోర్టుతో..
అయితే అతడిని నస్రుల్లాను కలవడానికి అంజు 30 రోజుల పాకిస్తాన్ వీసాపై గురువారం పాక్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఎఅప్పర్ దిర్‌ జిల్లాకు వెళ్లిన్నట్లు తేలింది. అయితే, అంజు పాకిస్థాన్‌లో ఉన్నట్టు తెలియడంతో రాజస్థాన్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఆమె గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిందని, పాక్‌కు వెళ్లేందుకు అంజూ వద్ద అన్ని ప్రయాణ పత్రాలు కరెక్ట్‌గానే ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. 

Advertisement
Advertisement