బ్యాంకాక్: ఈశాన్య థాయిలాండ్లో కాలినడకన తీర్థయాత్రకు బయల్దేరిన బౌద్ధ భిక్షువులను మృత్యువు ఒక ట్రక్కు రూపంలో వచ్చి కబళించింది. 11 ఏళ్ల బాలుడు ట్రక్కును నడిపి అమాంతం బౌద్ధ భిక్షువుల మీదకు పోనిచ్చాడు. దీంతో తీవ్రగాయాలతో 9 మంది భిక్షువులు ప్రాణాలు కోల్పోయారు. ముక్దహాన్ ప్రావిన్స్లోని ఆలయం నుంచి 260 కిలోమీటర్ల దూరంలోని రాట్చథానీ ప్రావిన్స్లోని మరో ఆలయానికి 34 మంది భిక్షువులు, ఐదుగురు శిష్యుల బృందం కాలినడకన తీర్థయాత్రకు బయల్దేరింది.
మార్గమధ్యంలో ఒక రహదారి పక్కన నడుస్తుండగా 11 ఏళ్ల బాలుడు పికప్ ట్రక్కును నడుపుతూ వచ్చి నేరుగా వీళ్ల మీదకు పోనిచ్చాడు. ట్రక్కు అత్యంత వేగంగా ఢీకొనడంతో ఐదుగురు భిక్షువులు అక్కడిక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కన్నుమూశారు. 22 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.


