‘‘భారతీయులూ బలయ్యారు’’.. ట్రంప్ ఎదుటే మోదీ ఆవేదన | Modi Tells G7: Indians Also Lost Lives Trump Also There | Sakshi
Sakshi News home page

‘‘భారతీయులూ బలయ్యారు’’.. ట్రంప్ ఎదుటే మోదీ ఆవేదన

Jun 17 2026 6:35 AM | Updated on Jun 17 2026 6:44 AM

Modi Tells G7: Indians Also Lost Lives Trump Also There

పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదని, భారతీయులు కూడా దాని మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర వాణిజ్య మార్గాల భద్రతపై భారత్ తరఫున ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతల కారణంగా భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని జీ7 సదస్సు వేదికగా ప్రపంచ నేతల దృష్టికి తీసుకెళ్లారు.

ఫ్రాన్స్‌లోని ఎవియన్‌లో జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “కొత్త భాగస్వామ్యాలు – అంతర్జాతీయ ఐక్యత పునర్నిర్మాణం” అంశంపై మాట్లాడిన మోదీ, పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు ముందుకు సాగడం స్వాగతార్హమని అన్నారు. అయితే ఆ ఘర్షణల వల్ల మిత్రదేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య రవాణా అంతరాయంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని పేర్కొన్నారు.

“భారతీయ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దేశాలను అనుసంధానించే సముద్ర వాణిజ్యంలో కీలక పాత్ర పోషించే నావికుల భద్రతను నిర్ధారించడం మనందరి బాధ్యత. సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి” అని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

మోదీ వ్యాఖ్యల వెనుక కారణం ఇదే
కొద్ది రోజుల క్రితం గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లో ప్రయాణిస్తున్న సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్‌పై అమెరికా బలగాలు దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. మొత్తం 28 మంది సిబ్బందిలో 24 మంది భారతీయులే ఉన్నారు. అమెరికా ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఇరాన్ చమురును తరలిస్తున్నారనే అనుమానంతో ఆ నౌకపై చర్యలు తీసుకున్నట్లు అమెరికా తెలిపింది.

ఇది ఒక్కటే కాదు. మారివెక్స్, జల్వీర్ అనే మరో రెండు నౌకలపైనా అమెరికా సైన్యం చర్యలు చేపట్టింది. ఈ మూడు నౌకల్లోనూ భారతీయ సిబ్బంది ఉండటం భారత్ ఆందోళనకు కారణమైంది.

అమెరికా చర్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం
ఈ ఘటనలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ పిలిపించి అధికారిక నిరసన (డిమార్ష్) అందజేసింది. భారతీయ నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, ఇటువంటి దాడులు వెంటనే ఆగాలని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, “సెట్టెబెల్లోపై దాడి జరిగిన వెంటనే అమెరికా ప్రభుత్వానికి బలమైన నిరసన తెలియజేశాం. భారతీయ నావికుల ప్రాణ భద్రతపై మా ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేశాం” అని వెల్లడించారు.

ప్రపంచానికి భారత్ సందేశం
జీ7 వేదికగా మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం భారతీయుల ప్రాణనష్టంపై ఆవేదన మాత్రమే కాదు. హర్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరా, ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆయన హెచ్చరించినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ సమక్షంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా భారతీయుల భద్రత విషయంలో రాజీ ఉండదనే సంకేతాన్ని కూడా మోదీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

17 నెలల తర్వాత.. 
ఫ్రాన్స్‌ వేదికగా జీ7 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ కరచాలనం చేశారు. ఈ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. గతేడాది ఫిబ్రవరి తర్వాత వీరిద్దరూ ప్రత్యక్షంగా పలకరించుకోవడం ఇదే మొదటిసారి. ఈ మధ్యకాలంలో టారిఫ్‌ వార్‌, ఆపరేషన్‌ సిందూర్‌ పరిణామాల నడుమ.. కీలక సదస్సులోనూ ఈ ఇద్దరూ ఒక్కచోట కనిపించలేదు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగానూ ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఫోన్‌తో పాటు సోషల్‌ మీడియాలో ట్వీట్లతో సంభాషించుకున్నారు.  జీ7 సదస్సులో భాగంగా.. బుధవారం ఇరు దేశాధినేతలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement