
సంయమనం పాటించండి
భారత్, పాకిస్తాన్లకు మార్కో రూబియో విజ్ఞప్తి
ఎస్.జైశంకర్, షెహబాజ్ షరీఫ్లకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్
రెండు దేశాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్ష
న్యూయార్క్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇరు దేశాల మధ్య సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన బుధవారం రాత్రి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాకిస్తాన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్లతో వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఎవరికీ మేలు చేయదని అన్నారు.
ఘర్షణ వాతావరణం సమసిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్.జైశంకర్తో మార్కో రూబియో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో భారత్కు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం అంతం కావాలని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించుకొనే విషయంలో భారత్, పాక్ కలిసి పనిచేయాలని, పూర్తిస్థాయిలో సంయమనం పాటించాలని కోరారు. దక్షిణాసియాలో శాంతిభద్రతల పరిరక్షణకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్.జైశంకర్ స్పందిస్తూ.. పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరులను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను చట్టంముందు నిలబెట్టి, శిక్షించక తప్పదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
భారత్కు పాక్ సహకరించాలి
పహల్గాం ఉగ్రదాడిపై జరుగుతున్న దర్యాప్తుకు పాకిస్తాన్ ప్రభుత్వం సహకరించాల్సిందేనని మార్కో రూబియో తేల్చిచెప్పారు. ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో మాట్లాడుతూ ఈ సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియాతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఉద్రిక్తతలు సడలిపోయేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు. పహల్గాంలో 26 మందిని పొట్టనపెట్టుకున్న ముష్కరులకు సరైన శిక్ష పడేలా భారత్కు సహకారం అందించాలని చెప్పారు. పాకిస్తాన్ నుంచి నిర్మాణాత్మక చర్యలను కోరుకుంటున్నామని రూబియో వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి పట్ల తమ వైఖరిని షెహబాజ్ షరీఫ్ అమెరికా విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఉగ్రవాదంపై పోరాటానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ సైతం ఉగ్రవాద బాధిత దేశమేనని, 90 వేల మందికిపైగా ప్రజలు ఉగ్రదాడుల్లో మరణించారని తెలిపారు. ఉగ్రవాదం వల్ల తమకు 192 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. పహల్గాం దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఉద్రిక్తతలు పెంచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఇండియాను కట్టడి చేయాలని రూబియోను కోరారు. సింధూనది జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేయడాన్ని షెహబాజ్ షరీఫ్ తప్పుపట్టారు. ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం చెల్లదని అన్నారు.
భారత్ హక్కుకు మద్దతిస్తున్నాం
తమను తాము రక్షించుకొనే హక్కు భారత్కు ఉందని, ఆ హక్కుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ సహకారం కచ్చితంగా ఉంటుందన్నారు. ఆయన గురువారం భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు. ధూర్త దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని తాము ఎంతమాత్రం సహించడం లేదని హెగ్సెత్ బదులిచ్చారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి సంతాపం ప్రకటించారు.