
టోక్యో: చైనాకు ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో జపాన్ తన సైనిక పాటవాన్ని వేగంగా పెంచుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా తొలిసారిగా మంగళవారం తన భూభాగంపై మొట్టమొదటి క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. హొక్కైడై దీవిలోని షిజునాయ్ యాంటీ ఎయిర్ ఫైరింగ్ రేంజ్ నుంచి టైప్ 88 సర్ఫేస్ టు షిప్ తక్కువ శ్రేణి క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు వెల్లడించింది.
40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించిందని తెలిపింది. పరిమిత స్థలం, రక్షణ పరమైన జాగ్రత్తల రీత్యా ఇప్పటి వరకు జపాన్ తన క్షిపణి ప్రయోగాలను విస్తారభూభాగాలున్న అమెరికా, ఆస్ట్రేలియాల్లో చేపడుతూ వచ్చింది. ఈ మేరకు ఆయా దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. సైనికపరమైన స్వయం సమృద్ధత సాధించే దిశగా మంగళవారం తన భూభాగంలోనే క్షిపణి పరీక్ష చేపట్టింది.