ఇటలీ ప్రధాని, భారత ప్రధాని స్నేహితులైతే.. | Italy Prime Minister Giorgia Meloni took Selfie with PM Modi | Sakshi
Sakshi News home page

#Melodi: ఇటలీ ప్రధానితో భారత ప్రధాని దోస్తీ చేస్తే..

Dec 2 2023 7:12 AM | Updated on Dec 2 2023 8:39 AM

Italy Prime Minister Giorgia Meloni took Selfie with PM Modi - Sakshi

దుబాయ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ  వివిధ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిని కూడా కలిశారు. మెలోని కూడా ప్రధాని మోదీతో సెల్ఫీ దిగి,  దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘మేం మంచి స్నేహితులం’ అని రాశారు. అలాగే ‘#మెలోడి’ అని రాసి.. అందులో మెల్ అంటే మెలోనీ అని.. ఓడి అంటే మోదీ అని రాశారు. 

వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఒకరోజు పర్యటన నిమిత్తం యూఏఈ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ దేశాధినేతలతో చర్చలు జరిపారు. మెలోనితో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ.. బ్రిటన్ ప్రధాని రిషి సునక్, బ్రెజిల్ ప్రధాని లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌లను కూడా కలిశారు. 

ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సులో నాలుగు సెషన్లలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ ఇతర నేతలు కలిసి గ్రూప్‌ ఫొటో కూడా దిగారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాతావరణ లక్ష్యాలను సాధించడంలో భారతదేశం చేపట్టే కార్యక్రమాలు, పురోగతిని ప్రధాని మోదీ వివరించారు. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి గ్రీన్ క్రెడిట్స్ ఇనిషియేటివ్‌లో చేరాలని ప్రపంచ నాయకులను ప్రధాని మోదీ కోరారు. 

కాప్‌-28 శిఖరాగ్ర సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ  యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కూడా కలిశారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. కాప్‌-28 శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంపై ప్రధాన మంత్రి మోదీ వారిని అభినందించారు. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌కు యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ప్రధాని ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి: మానవాళి స్వార్థంతో ప్రపంచానికి పెను చీకట్లే

Advertisement
 
Advertisement
Advertisement