గాజాస్ట్రిప్ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా కనీసం ఆరుగురు మృతిచెందినట్లు పాలస్తీనా మీడియా ప్రకటించింది.
అల్ జజీరా జర్నలిస్టు మృతి
అల్ జజీరాకు చెందిన కెమెరామెన్ అహ్మద్ విషా శనివారం మధ్య గాజాలోని బురెయిజ్ శరణార్థుల శిబిరంలో ఓ ఇంటిపై జరిగిన దాడిలో మరణించారు. ఈ ఘటనను అల్ జజీరా తీవ్రంగా ఖండిస్తూ, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకునే చర్యగా అభివర్ణించింది.
అయితే ఇజ్రాయెల్ డిఫన్స్ ఫోర్సస్ (IDF) మాత్రం అహ్మద్ విషా హమాస్ సైనిక విభాగానికి చెందిన స్నైపర్ ఆపరేటివ్ అని ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలను మాత్రం బహిర్గతం చేయలేదు.
మరో కుటుంబంపై దాడి
గాజా నగరంలోని సబ్రా ప్రాంతంలో ఓ ఇంటిపై జరిగిన మరో వైమానిక దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాధితుల బంధువులు తమ కుటుంబ సభ్యులకు హమాస్తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
కాల్పుల విరమణపై ప్రశ్నలు
గతేడాది అక్టోబర్లో పాలస్తీనాతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా ఇజ్రాయెల్ పదేపదే దాడులు చేస్తోంది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక ఇజ్రాయెల్ దాడుల్లో 1000 మందికిపైగా మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది.
సంక్షోభం
యునైటెడ్ నేషన్స్ అంచనాల ప్రకారం గాజాలో సుమారు 81 శాతం భవనాలు దెబ్బతిన్నాయి. సహాయ సామగ్రి ఎప్పటికప్పుడు అందుతున్నప్పటికీ.. ఆశ్రయం, తాగునీరు, వైద్యం, విద్య వంటి ప్రాథమిక అవసరాల కొరత ఇంకా కొనసాగుతోందని ఐరాస ప్రకటించింది.
యుద్ధ నేపథ్యం
హమాస్ ఆధ్వర్యంలోని దళాలు 2023 అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్పై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఆ దాడిలో సుమారు 1200 మంది మరణించగా, 251 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి గాజాలో 73 వేల మందికిపైగా మరణించినట్లు స్థానిక ఆరోగ్య శాఖ చెబుతోంది.


