ఆత్మ రక్షణ కోసమే ఆ దాడులు: భారత్‌ భిన్న స్వరం | India Reacts On Iran Surgical Strikes On Pakistan, Says We Understand Action Taken In Self Defence - Sakshi
Sakshi News home page

Iran Attacks On Pakistan: ఆత్మ రక్షణ కోసమే ఆ దాడులు.. అర్థం చేసుకున్నాం: భారత్‌ భిన్న స్వరం

Jan 18 2024 7:30 AM | Updated on Jan 18 2024 9:23 AM

Iran Surgical Strikes On Pak This Is Indias Reaction - Sakshi

అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఇరాన్‌ చర్యల్ని తప్పుపడుతున్న వేళ.. భారత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఢిల్లీ: పాకిస్థాన్‌ భూభాగంపై ఇరాన్‌ జరిపిన క్షిపణి దాడులపై భారత్‌ స్పందించింది. అది ఆ రెండు దేశాలకు సంబంధించిన అంశమని చెబుతూనే..  ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని,  ఆ రెండు దేశాల చర్యలు స్వీయరక్షణలో  భాగమై ఉంటాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఇది ఇరాన్‌, పాక్‌కు సంబంధించిన అంశం. భారతదేశానికి సంబంధించినంతవరకు.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోం. అయితే.. ఆ రెండు దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను మేము అర్థం చేసుకున్నాం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ మీడియాకు తెలిపారు. 

ఇరాక్‌, సిరియా సరిహద్దుల్లో క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.. ఆ మరుసటి రోజే పాక్‌ భూభాగంపై దాడులు జరిపింది. అగ్రరాజ్యం అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు ఈ క్షిపణి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇరాన్‌ను తప్పుబడుతున్నాయి.  అయితే భారత్‌ మాత్రం ఇలా భిన్న స్వరం వినిపించడం గమనార్హం. 

ఇదిలా ఉంటే.. జైష్‌ అల్‌ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకునే బెలూచిస్థాన్‌లోని ఆ సంస్థ స్థావరాలపై డ్రోన్స్‌,  మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు ఇరాన్‌ చెబుతోంది. కిందటి నెలలో15వ తేదీన ఇరాన్‌ సిస్తాన్-బెలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌పై జైష్‌ అల్‌ విరుచుకుపడింది. ఈ దాడిలో 11 మంది పోలీసులు మరణించారు. ప్రతీకారంగానే ఆ ఉగ్ర సంస్థను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ ఈ సర్జికల్‌ స్ట్రైక్‌ నిర్వహించినట్లు స్పష్టం అవుతోంది. 



‘‘పొరుగు దేశం పాక్‌ మాకు ఎప్పటికీ మిత్రదేశమే. ఆ దేశ సార్వభౌమత్వాన్ని మేం గౌరవిస్తాం. అలాగని.. మా దేశ భద్రత విషయంలో మాత్రం రాజీపడబోం. కేవలం పాక్‌ భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల్నే మేం లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాం అని ఇరాన్‌ రక్షణ విభాగం ప్రకటించింది. 

మరోవైపు పాక్‌ మాత్రం  ఆ దాడులపై తీవ్రంగా స్పందించింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు మరణించారని ప్రకటించి.. ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇరాన్‌ దౌత్యవేత్తను బహిష్కరించిన పాక్‌.. తెహ్రాన్‌(ఇరాన్‌ రాజధాని)లోని తమ రాయబారిని వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement