
ఆస్ట్రేలియాలో భారతీయునిపై పోలీసు జులుం
రెండు వారాలు కోమాలోకి వెళ్లి ఆస్పత్రిలో మృతి
మెల్బోర్న్: భార్యాభర్తల నడుమ చిన్న వాగ్వాదంపై ఆ్రస్టేలియా పోలీసుల అతి స్పందన, మితిమీరిన జులుం, ఆటవికులను తలపించిన కర్కశత్వం చివరికి ఓ భారతీయుని ప్రాణాలు బలిగొన్నాయి. తలను నేలకేసి కొట్టడమే గాక మెడపై మోకాలితో తొక్కిపెట్టడంతో 42 ఏళ్ల గౌరవ్ కుందీ మెదడుకు తీవ్ర గాయమైంది. దాంతో కోమాలోకి వెళ్లి ఆస్పత్రిలో రెండు వారాలుగా మృత్యువుతో పోరాడి గురువారం తుదిశ్వాస విడిచాడు. ఐదేళ్ల క్రితం అమెరికాతో పాటు ప్రపంచమంతటినీ కుదిపేసిన ‘ఫ్లాయిడ్’ ఉదంతాన్ని తలపించిన ఈ క్రూరత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ రోజు అసలేమైంది?
గౌరవ్, అమృత్పాల్ కౌర్ దపంతులు అడిలైడ్లో నివసిస్తున్నారు. వారికిద్దరు పిల్లలు. జూన్ మొదటి వారంలో జరిగిన దారుణాన్ని భార్య మీడియాతో పంచుకున్నారు. ‘‘మేమిద్దరం మా ఇంటి సమీపంలో నడుస్తున్నాం. నా భర్త కాస్త తాగి ఉన్నారు. మా మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఆయన నన్ను దూరంగా నెట్టేయడాన్ని పెట్రోలింగ్ పోలీసులు చూశారు. వెంటనే ఒక పోలీసు మా దగ్గరికొచ్చాడు. వస్తూనే నా భర్తను పోలీస్ కారుకేసి విసురుగా కొట్టాడు. తర్వాత కిందపడేసి తలను నేలకు గట్టిగా అదిమిపెట్టాడు.
నా భార్యను హింసించడం లేదు అంటూ ఆయన మొత్తుకుంటున్నా వినిపించుకోలేదు. మేం కేవలం గట్టిగా మాట్లాడుకున్నామని, వదిలేయండని నేనూ అరిచినా పట్టించుకోలేదు. మెడపై చాలాసేపు మోకాలితో అదిమిపట్టడంతో ఊపిరాడక గౌరవ్ చివరకు స్పృహ తప్పారు. అయినా అరెస్ట్ చేయబోగా బతిమాలి ఆస్పత్రిలో చేరి్పంచా.
మెడ, మెదడు నరాలు బాగా దెబ్బతిని కోమాలోకి వెళ్లాడు, స్పృహలోకి రావడం కష్టమని వైద్యులు చెప్పారు’’ అంటూ వాపోయారు. 2020 మే నెలలో జార్జ్ ఫ్లాయిడ్ అనే 46 ఏళ్ల నల్ల జాతీయున్ని శ్వేతజాతి పోలీసు ఏకంగా తొమ్మిది నిమిషాల పాటు నేలకేసి అదిమిపట్టి ఊపిరాడకుండా చేయడం తెలిసిందే. దాంతో ఆయన నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయారు. ‘ఐ కాంట్ బ్రీత్’ అంటూ ఫ్లాయిడ్ చేసిన ఆర్తనాదాలు అమెరికావ్యాప్తంగా నల్లతీయుల సమరనాదంగా మారాయి.
పోలీసుల భిన్న వాదన
పోలీసులు మాత్రం తాము క్రూరంగా వ్యవహరించలేదని చెబుతున్నారు. అయినా ఈ ఉదంతాన్ని పోలీస్ కస్టడీ మరణంగా భావిస్తామని శుక్రవారం ప్రకటించారు. అయితే, అప్పట్లో ఘటన తర్వాత సౌత్ ఆ్రస్టేలియన్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ మోకాలితో మెడపై అదిమిపెట్టడంనిజమేనని అంగీకరించడం విశేషం.