నేపాల్‌లో భూకంపం.. వరద విలయం.. 157 మందికిపైగా జలసమాధి! | Hundreds missing and scores dead as flash flood hits Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో భూకంపం.. వరద విలయం.. 157 మందికిపైగా జలసమాధి!

Aug 27 2026 5:32 AM | Updated on Aug 27 2026 5:44 AM

Hundreds missing and scores dead as flash flood hits Nepal

నేపాల్‌లో భూకంపం ధాటికి విరిగి పడిన కొండచరియలు, గ్లేసియర్లు

నేపాల్‌ను ముంచెత్తిన ప్రకృతి విపత్తు

మెరుపు వరదల్లో 157 మందికిపైగా జలసమాధి! 

750 మందికిపైగా పర్యాటకుల జాడ గల్లంతు

భూకంపం ధాటికి విరిగిపడిన కొండచరియలు

హిమానీనదాల మంచుతో భోటెకోశి నదిలో ఒక్కసారిగా పెరిగిన ఉధృతి 

ఉగ్రరూపం దాల్చి లోతట్టు ప్రాంతాలను ముంచేసిన నది 

జాడ తెలీకుండా పోయిన వారిలో 133 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు  

ఇళ్లు, వంతెనలు, ప్రాజెక్టులు, రోడ్లు సర్వనాశనం 

యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న నేపాల్‌ ఆర్మీ ముమ్మర అన్వేషణ

కఠ్మాండు/బీజింగ్‌/న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపం ధాటికి నేపాల్‌ చివురుటాకులా వణికిపోయింది. రాజధాని కఠ్మాండు సమీపంలోని రాసువా, దాడింగ్‌ జిల్లాల ఎగువ ప్రాంతంలో బుధవారం ఉదయం సంభవించిన భూకంపం తర్వాత పెను ఉపద్రవాన్ని మోసుకొచ్చింది. ఉదయం 8.37 గంటలకు టిబెట్‌ సరిహద్దు ప్రాంతంలో కొడారీ అనే చోట భూమికి 77 కిలోమీటర్ల లోతులో రిక్టర్‌ స్కేల్‌పై 4.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి హిమాలయ పర్వతప్రాంతంలోని కొండచరియలు విరిగిపడ్డాయి. 

దీంతో ఆ కొండల మీది గ్లేసియర్‌(హిమానీనదాలు)లోని భారీ స్థాయిలో మంచు ఒక్కసారిగా దిగువన ఉన్న భోటె కోశీ నదిలో పడింది. దీంతో మంచు కరిగి అనూహ్య రీతిలో నదీ ప్రవాహం, నీటి మట్టం పెరిగాయి. దీంతో మెరుపు వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. నది ఉగ్రరూపం దాల్చి దిగువన ఉన్న రాసువా, ధాడింగ్‌ జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతాల్లోని వందలాది ఇళ్లు, డజను జలవిద్యుత్‌ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు, దుకాణ సముదాయాలను సర్వనాశనం చేసింది. 42 కి.మీ.ల పొడవైన కీలక బేద్రావతి–రసువాగఢి రోడ్డు కొట్టుకుపోయింది. 

నేపాల్‌ పర్వతప్రాంత రమణీయతను చూసేందుకు దేశవిదేశాల నుంచి తరలివచ్చిన పర్యాటకులు ఈ మెరుపు వరదల్లో జలసమాధి అయ్యారు. 157 మందికిపైగా చనిపోయారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 750 మందికిపైగా పర్యాటకులు, స్థానికుల జాడ గల్లంతైంది. జాడ తెలీకుండా పోయిన వారిలో 133 మంది భారతీయులు, 37 మంది ప్రవాస భారతీయులు ఉన్నట్లు టూరిస్ట్‌ కంపెనీలు, స్థానిక యంత్రాంగం గణాంకాలను బట్టి తెలుస్తోంది. 

నువాకోట్, ఛిటావన్‌ జిల్లాల్లోనూ మెరుపు వరదల భీభత్సం ఎక్కువగాఉంది. వరద ఉధృతికి సమీపంలోని ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు పేకమేడల్లా కూలాయి. కార్లు, ఇతర వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. అసలేం జరుగుతుందో తెలిసేలోపే అమాంతం వరద ముంచెత్తి జనం జలసమాధి అయిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నేపాల్‌–చైనా సరిహద్దులోని రసువాగఢి చెక్‌పోస్ట్‌లో రెండంతస్తుల భవంతిని వరదనీరు రెప్పపాటులో సర్వనాశనం చేసిన వీడియో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

వరదధాటికి ఇక్కడ నేపాల్‌–చైనా భూతల మార్గం పూర్తిగా ధ్వంసమైంది. వరద ఉధృతికి నామరూపాలు కోల్పోయి, బురదలో కూరుకుపోయి ఆ ప్రాంతాలన్నీ భీతావహంగా మారాయి. ఎటు చూసినా అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, సాయం కోసం అరి్థస్తున్న జనం హాహాకారాలతో ఆ ప్రాంతాల్లో విషాద వాతావరణం రాజ్యమేలుతోంది. భోటె కోశీ నదీజలాలు తర్వాత తిబూరే ప్రాంతంలో త్రిశూలి నదిలోకి రావడంతో దాని కారణంగానూ ఒకింత విధ్వంసం పెరిగింది. బుధవారం రాత్రినాటికి ఏడు జిల్లాల్లో 95 మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నారు.  

బిహార్, యూపీలో అలర్ట్‌ 
నేపాల్‌ వరద నీటితో గండక్‌ నదిలో నీటి మట్టం పెరిగే ఆస్కారం ఉండటంతో బిహార్, ఉత్తర ప్రదేశ్‌లో స్థానికయంత్రాంగాలు నదీపరీవాహక ప్రాంతాలోని ప్రజలను అప్రమత్తంచేశాయి. దిగువ ప్రాంతాల నుంచి ఎగువ ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు. అవసరమైతే తగు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బిహార్‌ ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భరోసా ఇచ్చారు. గండక్‌ నదిపై ఒక బరాజ్‌లో 36 గేట్లను ఎత్తి నీళ్లను కిందకు వదిలేస్తున్నారు. వరదనీటి ముప్పు ఉండే ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్, కుషీనగర్‌ జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు, సహాయక బృందాలకు యూపీ సీఎం యోగి సూచించారు.  

చైనా ఆపన్న హస్తం
తమ అధీనంలోని టిబెట్‌లోని సరిహద్దు ప్రాంతాల్లోనూ ఈ వరద విలయం ఎక్కువగా ఉండటంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ విస్తృతస్థాయిలో అన్వేషణ, సహాయక చర్యలు చేపట్టాలని ఆర్మీకి ఆదేశాలిచ్చారు.

మానస సరోవర్‌ యాత్రికులు సైతం
అమెరికా, మలేసియా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, దక్షిణకొరియా పర్యాటకుల జాడ తెలీడంలేదని నేపాల్‌ టూరిజం బోర్డ్‌ తెలిపింది. టిబెట్‌లోని కైలాస్‌ మానస సరోవర్‌ను దర్శించుకునేందుకు యాత్రకు వచ్చిన 77 మంది భారతీయుల జాడ సైతం తెలీడంలేదని సామ్రాట్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్‌ ఏజెన్సీ వెల్లడించింది. దీంతో భారతీయుల జాడ కనిపెట్టి ఎలాగైనా క్షేమంతా స్వదేశానికి తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్‌ నడుం బిగించింది.

 నేపాల్‌ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం భరోసా ఇచ్చింది. 341 మంది పర్యాటకులు, 291 మంది విదేశీయులు, 62 మంది నేపాలీల జాడ తెలీడంలేదని నేపాల్‌ టూరిజం బోర్డ్‌ ప్రకటించింది. 24న నేపాల్‌ పర్యటనకు వెళ్లిన పశ్చిమబెంగాల్‌లోని ఆరామ్‌బాగ్‌కు చెందిన 65 మంది పర్యాటకులు సైతం వరద ప్రాంతంలో చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి.

పూర్తి సాయం చేస్తాం: ప్రధాని మోదీ 
వరద విలయం వార్త తెలియగానే నేపాల్‌ ప్రధాని బాలేంద్రకు భారత ప్రధాని మోదీ ఫోన్‌చేసి మాట్లాడారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తున్నట్లు ఆయనతో మోదీ చెప్పారు. మిత్రదేశమైన నేపాల్‌కు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సదాసిద్ధంగా ఉన్నట్లు మోదీ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పటికే భారత వాయుసేన విమానాల్లో అత్యవసర ఉపకరణాలు, ఔషధాలు, ఆహారం, ఇతర సామగ్రిని నేపాల్‌కు తరలిస్తున్నారు. 

కష్టకాలంలో నేపాలీ సోదర, సోదరీమణులకు అండగా ఉంటామని తర్వాత మోదీ ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బలగాలు సైతం నేపాల్‌కు తరలివెళ్లే ఆస్కారముంది. అదనపు సాయం కోసం సీ–17 గ్లోబ్‌మాస్టర్, లాక్‌హీడ్‌ సీ–130 రవాణా విమానాలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు భారీ సంఖ్యలో భారతీయులు నేపాల్‌లో గల్లంతుకావడం, వరద ప్రాంతాల్లో చిక్కుకోవడంతో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని మోదీ సర్కార్‌కు విపక్ష కాంగ్రెస్‌ సూచించింది.

రంగంలోకి నేపాల్‌ ఆర్మీ... 
విషయం తెల్సి నేపాల్‌ సైన్యం, సాయుధ పోలీస్‌ బలగాలు, నేపాల్‌ పోలీసులు, జాతీయ విపత్తు స్పందన బలగాలు, అగ్నిమాపక సిబ్బంది, డ్రోన్లు మెరుపు వేగంతో రంగంలోకి దిగి బాధితులను కాపాడేందుకు అన్వేషణ, సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నాయి. వీళ్లను కాపాడే క్రమంలో ఇప్పటికే 80 మంది భద్రతా బలగాలు, 44 నేపాల్‌ సైనికులు సైతం గల్లంతైనట్లు నేపాల్‌ విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనాల్‌ ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటించారు. 

త్రిశూలి ప్రాంతంలో 80 మందిని ఆర్మీ హెలికాప్టర్లు కాపాడాయి. ఇప్పటిదాకా 300 మందిని కాపాడినట్లు ప్రధాని బాలేంద్ర తెలిపారు. గాయపడిన వారిని సమీప ఎగువ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో చేరి్పంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వరద ప్రభావిత ప్రాంతాలు పర్వతసానువుల వద్ద ఉండటంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. రాసువా ప్రాంతంలో కుంభవృష్టి కారణంగా మెరుపు వరదలు వచ్చాయన్న వార్తల్లో నిజం లేదని మంత్రి శిశిర్‌ స్పష్టంచేశారు. పరిస్థితిని దేశ ప్రధాని బాలేంద్ర షా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement