ఫ్రాన్స్‌లో నిలిపివేసిన భారత విమానంలో పది మంది ఒంటరి మైనర్లు | Flight From Dubai With 300 Indians Halted In France Over Human Trafficking, See More Details Inside - Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌లో నిలిపివేసిన భారత విమానంలో పది మంది ఒంటరి మైనర్లు

Published Sun, Dec 24 2023 7:51 AM

Flight With Indians Halted In France Over Human Trafficking - Sakshi

ప్యారిస్: ఫ్రాన్స్ నిలిపివేసిన భారతీయులు ప్రయాణిస్తున్న విమానంలో పది మంది ఎవరూ తోడు లేని మైనర్లు ఉన్నట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఇందులో ఆశ్రయం కోరుతూ ఆరుగురు మైనర్లు ధరఖాస్తు చేసుకున్నారని స్పష్టం చేశారు. అయితే.. ప్రయాణికుల నిర్బంధాన్ని మరో ఎనిమిది రోజులు పొడిగించే అవకాశం ఉంది. ఈ కేసుపై నేడు విచారణ కొనసాగనుంది.

మానవ అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో ఫ్రాన్స్‌లో 303 మంది భారతీయులు ప్రయాణిస్తున్న విమానాన్ని అధికారులు నిలిపివేశారు. విమానం నిలిపివేతపై స్పందించిన ఫ్రాన్స్ లోని భారత్ ఎంబసీ.. దౌత్య బృందానికి కాన్సులర్ యాక్సిస్ లభించిందని వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 

రొమేనియన్ కంపెనీ లెజెండ్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న A340 విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి బయలుదేరింది. 303 మంది భారతీయులతో ఉన్న ఈ విమానం నికరాగ్వాకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని వాట్రి విమానాశ్రయానికి చేరుకోగానే ఫ్రాన్స్ అధికారులు విమానాన్ని నిలిపివేశారు. మానవ అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం వచ్చిన కారణంతో విమానాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. 

"ఫ్రెంచ్ విమానాశ్రయంలో సాంకేతిక నిలిపివేత సమయంలో దుబాయ్ నుండి నికరాగ్వాకు బయలుదేరిన విమానాన్ని నిలిపివేశారు. ఇందులో దాదాపు 303 మంది భారతీయ మూలాలు కలిగినవారే ఉన్నారు. విమానం నిలిపివేత గురించి ఫ్రెంచ్ అధికారులు మాకు సమాచారం అందించారు. పరిస్థితిని పరిశీస్తున్నాం" అని భారత  ఎంబసీ అధికారులు ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

విమానంలో ఉన్న ప్రయాణికులను ప‍్రత్యేక వసతి గృహాలకు తరలించారు. ఒక్కొక్కరిని అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికుల నుంచే నిజానిజాలను కనుక్కునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.  

ఇదీ చదవండి: Temple Vandalised: భారత్‌ స్ట్రాంగ్‌ రియాక్షన్‌

Advertisement
Advertisement