
వాషింగ్టన్: ఇరాన్-ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో టెహ్రాన్(ఇరాన్)లోని పౌరులు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి, వెళ్లిపోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో ఆయన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయాల్సిందేనంటూ పునరుద్ఘాటించారు. పరిస్థితి మరింత దిగజారకముందే ఇజ్రాయల్తో ఏర్పడే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, ఇప్పడు ఇరాన్కు మరో అవకాశం ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీనిని ఆయన తన ‘ట్రూత్ సోషల్’లో పోస్టు చేశారు.
ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధం మరింత తీవ్రమయ్యేందుకు దారితీసేలా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల సమావేశంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధంపై స్పందించారు. అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సిందన్న ట్రంప్, అక్కడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయలేదని ట్రంప్ పేర్కొన్నారు. కాగా యుద్ధం ముగించాలంటే ఇరాన్ సుప్రీం నేత ఖమేనీని అంతం చేయాల్సిందేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్పై ఇరాన్ వందకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ సైతం ఇరాన్పై దాడులు చేసింది. టెహ్రాన్ గగనతలంపై తమ ఆధిపత్యం కొనసాగుతున్నదని ఇజ్రాయెల్ పేర్కొంది. తాము ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఇంతలోనే ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించడం గమనార్హం.
ఇది కూడా చదవండి: ఖమేనీ అంతంతోనే యుద్ధం ముగింపు: నెతన్యాహు