వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య మళ్లీ ముదురుతున్న ఘర్షణలను ఆపేందుకు తానే నేరుగా జోక్యం చేసుకున్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ నాయకత్వానికి "Calm down and use your head" (శాంతించండి... కాస్త ఆలోచించండి) అని చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ వెల్లడించారు.
కాగా, ఇటీవల లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపగా, ప్రతిగా హెజ్బొల్లా కూడా రాకెట్ దాడులకు దిగింది. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారి యుద్ధం ప్రాంతమంతా వ్యాపించే అవకాశాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. ఇరాన్ కూడా పరోక్షంగా సహకరించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. చివరకు శుక్రవారం సాయంత్రం నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు.
అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుతో నేరుగా చర్చించినట్టు తెలిపారు. ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలకు దూరంగా ఉండాలని సూచించానని, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అమెరికా తీవ్ర దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పారు. కొన్నిసార్లు ఇజ్రాయెల్ నాయకత్వాన్ని "కాస్త సెన్స్తో వ్యవహరించేలా చేయాల్సి వస్తోంది" అంటూ వ్యాఖ్యానించారు.
అంతకుముందు జూన్ ప్రారంభంలో కూడా ట్రంప్, నెతన్యాహూతో మాట్లాడి బీరూట్ వైపు సాగుతున్న ఇజ్రాయెల్ సైనిక చర్యలను నిలిపివేయించానని ప్రకటించారు. అదే సమయంలో మధ్యవర్తుల ద్వారా హెజ్బొల్లాతోనూ సంప్రదింపులు జరిగాయని, ఇరు పక్షాలు కాల్పులు తగ్గించేందుకు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించిన పలు ఒప్పందాలు కొద్ది రోజులకే విఫలమయ్యాయి. తాజా ఒప్పందం కూడా ప్రాంతీయ శాంతి చర్చలు, అమెరికా-ఇరాన్ చర్చల భవిష్యత్తుకు కీలకంగా మారింది


