
ఇస్లామాబాద్: భారత్కు వ్యతిరేకంగా మరోసారి దాయాది పాకిస్తాన్, డ్రాగన్ చైనా కొత్త కుట్రలకు ప్లాన్ చేస్తున్నాయి. భారత్ దాడులకు కుదేలైన పాకిస్తాన్ ఆర్మీకి సపోర్ట్ అందించేందుకు చైనా మళ్లీ ముందుకు వచ్చింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్ సపోర్టు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.
వివరాల ప్రకారం.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్తాన్కు చుక్కలు కనిపించాయి. పాకిస్తాన్లోని రావల్పిండి, లాహోర్, సియాల్ కోట్తో సహా 11 వైమానిక స్థావరాలపై భారత్ అత్యంత ఖచ్చితమైన దాడులు జరిపింది. దీంతో, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ, శాటిలైట్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు సాయం చేసేందుకు చైనా మరోసారి ముందుకు వచ్చింది. పాకిస్తాన్కి శాటిలైట్ కవరేజ్ పెంచడం, పాకిస్తాన్ సైన్యానికి మద్దతు ఇవ్వడం, భారత కార్యకలాపాల గురించి వారికి తెలియజేయడమే లక్ష్యంగా చైనా ఈ సాయాన్ని అందిస్తోంది. రియల్ టైమ్ కో-ఆర్డినేషన్, నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి 5G కమ్యూనికేషన్ వ్యవస్థల ఏకీకరణపై కూడా రెండు దేశాలు దృష్టి సారించాయి. దీనిపై ఇరు దేశాల మధ్య గత వారం చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. చైనా తన బీడౌ ఉపగ్రహ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం యాక్సెస్ చేయడానికి మే 16న చైనా, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.
మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా పాకిస్తాన్ తన శాటిలైట్ సేవల్ని పాకిస్తాన్ సైన్యానికి అందించినట్లు తెలుస్తోంది. ఈ సాయం అందినప్పటికీ భారత్ దాడులను తప్పించుకోలేకపోయింది. పాకిస్తాన్ సైన్యం ఉపయోగించే చైనా నిర్మిత జెట్లు, క్షిపణి వ్యవస్థలను భారత స్వదేశీ ఆయుధాలు ఉపయోగించి ధ్వంసం చేసింది. సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దళాల కదలికల్ని, కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత్ ఏకంగా 10 శాటిలైట్స్ని మోహరించింది. S-400 వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా మోహరించింది. దీంతో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది.