
మెక్సికో సిటీ: నార్త్ అమెరికాలోని మెక్సికోకు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు పలు ఆటోమొబైల్స్ను తీసుకెళ్తున్న కార్గో షిప్ ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడం, అననుకూల వాతావరణం కారణంగా భూమి నుండి 415 మైళ్ల దూరంలో ‘మార్నింగ్ మిడాస్’ షిప్ మునిగిపోయింది.
600 అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ కార్గో షిప్ జూన్ 3న అలాస్కా తీరానికి 300 మైళ్ల దూరంలో మంటల్లో చిక్కుకుంది. ఈ షిప్ మూడు వేల కొత్త వాహనాలను మెక్సికోకు డెలివరీ చేసేందుకు తరలివెళుతోంది. వాటిలో 800 ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి. ఆన్బోర్డ్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం భారీగా జరిగిందని సమాచారం. లండన్కు చెందిన ‘జోడియాక్ మారిటైమ్’ తెలిపిన వివరాల ప్రకారం, అలాస్కాలోని అలూటియన్ దీవుల అంతర్జాతీయ జలాల్లో షిప్ మునిగిపోయింది.
ఈ సంఘటన తర్వాత విపరీతమైన కాలుష్య ప్రభావం కనిపించలేదని యూఎస్ఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాలుష్య నియంత్రణ కోసం రెండు సాల్వేజ్ టగ్లను క్యారియర్ మునిగిపోయిన ప్రాంతంలో ఉంచినట్లు ఆయన తెలిపారు. అలాస్కా తీరానికి 300 మైళ్ల దూరంలో 600 కార్గో షిప్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, ఆ షిప్లోని సిబ్బంది ఈ సమాచారాన్ని యూస్ కోస్ట్ గార్డ్కు అందించారు. వెంటనే స్పందించిన కోస్ట్ గార్డ్ ప్రమాద స్థలానికి చేరుకుని, 22 మందిని లైఫ్ బోట్లలో తరలించింది. క్యారియర్ సమీపంలోని ఒక మర్చంట్ మెరైన్ నౌక సహాయక చర్యల్లో పాల్గొంది.
ఇది కూడా చదవండి: ‘హనీమూన్ కేసు’లో బిగ్ ట్విస్ట్.. సోనమ్, రాజ్లు అప్పటికే..