ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. పాక్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని తమ వైమానిక దళం దాడులు చేసిందని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ దాడులు బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో జరిగినట్లు సమాచారం.
ఈ శిబిరాలు ISIL-Khorasan (ఐసిస్-కె) కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉపయోగిస్తున్నారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్కడి నుంచి ఆఫ్ఘన్పై దాడులకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆరోపించింది.
అయితే ఈ ఆరోపణలను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. ఆఫ్ఘన్ ప్రకటనలను అబద్ధాలు, దుష్ప్రచారంగా అభివర్ణించింది.
గత కొద్ది నెలలుగా ఇరుదేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పలుమార్లు దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకోవడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
చైనా మధ్యవర్తిత్వంతో జరిగిన శాంతి ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలితాన్ని ఇవ్వలేదు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా ఇరు దేశాలు కయ్యానికి కాలుదువ్వుతుండటంతో మరింత ఆందోళన కలిగిస్తుంది.


