వాషింగ్టన్: ఇస్లామాబాద్లో జరుగుతున్న అమెరికా–ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా నౌకాదళానికి చెందిన రెండు గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు హర్మూజ్ జలసంధిని ఎటువంటి సమస్యలు లేకుండా దాటినట్లు ఆయన వెల్లడించారు. ఈ చర్యను ‘ప్రపంచానికి మేలు చేసే ప్రయత్నం’గా ఆయన అభివర్ణించారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఈ నౌకలు తూర్పు నుండి పశ్చిమ దిశగా గల్ఫ్లోకి ప్రవేశించి, తిరిగి అరేబియన్ సముద్రానికి చేరుకున్నాయి. ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో మాట్లాడుతూ.. మేము హర్మూజ్ జలసంధిని శుభ్రం చేసే ప్రక్రియను ప్రారంభించాం. ఇది చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు మేము చేస్తున్న ఉపకారం. వారికి ఈ పని చేయడానికి ధైర్యం లేదు” అని ఎద్దేశించారు.
అదే సమయంలో ఆయన ఇరాన్కి పెద్దగా సైనిక శక్తి లేకపోయినా, సముద్రంలో ఉంచిన మైన్ల వల్లే అమెరికా నౌకలకు ప్రమాదం కలుగుతుందని సూచించారు. అంటే, ఇరాన్కి ప్రత్యక్షంగా అమెరికా నౌకలను ఎదుర్కొనే శక్తి లేదని, కానీ మైన్ల ముప్పు మాత్రం అమెరికా నౌకలకు ఒక పెద్ద సవాలుగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించిన నాటి నుంచి హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇటీవల కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ మార్గాన్ని తిరిగి తెరవడం ఒక ముఖ్యమైన షరతుగా ఉన్నప్పటికీ, ఇరాన్ ఇప్పటికీ పూర్తిగా నియంత్రణలోకి తీసుకోలేకపోయింది. ఈ పరిణామాల మధ్య ఇరాన్–అమెరికా మధ్య శాంతి ఒప్పంద చర్చలు ఇస్లామాబాద్లో కొనసాగుతున్నాయి. రెండు గంటలకు పైగా జరిగిన ఈ చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేస్తోంది. ఈ చర్చలు పశ్చిమాసియాలో కాల్పుల విరమణతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట కలిగించాలనే లక్ష్యంతో జరుగుతున్నాయి.


