మల్కాజిగిరి సీపీ సుమతి
సాక్షి, సిటీబ్యూరో: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి సూచించారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో షాలోమ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్, అపూర్వ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ (హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 320–ఏ) సంయుక్తంగా రూపకల్పన చేసిన స్టాప్ డ్రగ్ అబ్యూజ్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమతి మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో యువత డ్రగ్స్కు బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మత్తులో మహిళలపై అత్యాచారాలకు కూడా పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదం నుండి పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లల మానసిక స్థితిని, వారి స్నేహితులను నిరంతరం గమనిస్తూ వారు చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకోవాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలన కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్, అపూర్వ లయన్ చైర్పర్సన్ నైనా దేవి, షాలోమ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సీహెచ్ అశోక్, ఫౌండేషన్ సలహాదారులు హైకోర్ట్ అడ్వకేట్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు.


