
అందంగా.. సుందరంగా..
త్వరలో మిస్ వరల్డ్ పోటీలు
సన్నద్ధమవుతున్న నగరం
సాక్షి, హైదరాబాద్: నగర విశిష్టతల్లో తలమానికంగా చేరనున్న మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమం ‘మిస్ వరల్డ్ 2025’ పోటీలు. ఇందులో భాగంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రణాళికల్లో భాగంగా ఇప్పటికే నిర్వహణ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగడం నగరానికే గర్వకారణం. ఇందులో భాగంగా పలు ప్రత్యేక ప్రాంతాల్లో క్రౌన్ రూపంలో ప్రతిమలు, లైటింగ్ ఎఫెక్టులు, అధునాతన హంగులను రూపొందించనున్నారు.
మిస్ వరల్డ్ పోటీలు జరిగే ప్రధాన ప్రాంతమైన హైటెక్స్ వేదిక సమీప ప్రాంతాలను అంతర్జాతీయ ప్రముఖులు హౌరా అనేలా రమణీయంగా తీర్చిదిద్దుతున్నారు. పలు ప్రాంతాల్లో కళ్లు మిరుమిట్లుగొలిపే థీమ్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. హైటెక్ సిటీలోని దుర్గం చెరువు, ఏఎంబీ మాల్, గచ్చిబౌలి, రాయదుర్గం మెట్రో స్టేషన్ల వద్ద సెల్ఫీ పాయింట్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా నూతనంగా రూపొందించిన మిస్ వరల్డ్ లోగోను కూడా ఈ ప్రచారంలో వినియోగిస్తున్నారు.
సందడి చేయనున్న గ్లోబల్ సెలబ్రెటీలు..
మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో దాదాపు 130 దేశాల నుంచి అంతర్జాతీయ ప్రముఖులు నగరానికి రానున్న్నారు. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ రోడ్లో 130 దేశాలకు చెందిన జాతీయ పతాకాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ అతిథుల కోసం ఇప్పటికే ట్రైడెంట్ హోటల్ను నెల రోజుల పాటు ముందస్తుగానే బుక్ చేయడంతో పాటు పలు 5 స్టార్, 3 స్టార్ హోటళ్లను వినియోగించుకోనున్నారు. మాజీ ప్రపంచ సుందరీమణులు, గ్లోబల్ సినీ ప్రముఖులు, విదేశాంగ ప్రముఖులు ఇతర విభిన్న రంగాలకు చెందిన సెలబ్రెటీలు నగరానికి విచ్చేయనున్నారు.
శుక్రవారం (ఈ నెల 2న) నగరంలోని హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు సోనూసూద్, మాజీ మిస్ ఇండియా నందినీ గుప్తా ముఖ్య అతిథులుగా వస్తున్నట్టు సమాచారం. 10న జరగనున్న ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.