
మరి ఉన్నాయా మీ స్కూల్లో
తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోపఠన విధానంపై తాజాగా జి.ఓ తెచ్చింది. దీని ప్రకారం ప్రతి వారం స్కూల్ బుక్స్తో పాటు సాహిత్యం, జి.కె, కళ, క్రీడా పుస్తకాలు చదవాలి. ఇప్పటికే అక్కడ ‘పఠన ఉద్యమం’ పేరుతో ప్రతి క్లాస్లో లైబ్రరీ పెట్టి ఎంచిన 120 పుస్తకాలు ఉంచారు. ఈ సంవత్సరం టాపిక్ వైజ్ చదువు పెట్టి దానికి సంబంధించిన మెటీరియల్ ఇస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బడులలో పిల్లలకు లైబ్రరీలు, పఠన విధానంపై ఇలాంటి అడుగు పడాల్సి ఉంది.
స్కూల్లో లైబ్రరీ ఉండటం బ్లాక్బోర్డ్ ఉండటం అంత సహజం. కాని స్కూళ్లలో లైబ్రరీల నిర్వహణ చాలా నిర్లక్ష్యంగా ఉంటుంది. లైబ్రరీ గదులు ఉండవు. ఉన్నా ర్యాక్స్ ఉండవు. ఉన్నా వాటిలో పుస్తకాలుండవు. ఉన్నా విద్యార్థులకు పనికి వచ్చేవి ఉండవు. శాస్త్రీయమైన విధానంతో పిల్లలు చదవడానికి అవసరమైన పుస్తకాలు ప్రతి స్కూల్లోని ప్రతిక్లాసులో విధిగా ఉండాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖలు కృషి చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పని అంతంతమాత్రంగానే సాగుతుండగా తమిళనాట ఉధృతంగా జరుగుతోంది.
బడులు తెరిచిన వేళ తమిళనాడు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం 1 నుంచి 8 తరగతుల వారికి పఠన విధానం అకడమిక్ పుస్తకాలు, నాన్ అకడమిక్ పుస్తకాలుగా సాగాలని నిర్ణయించారు. అంటే చదువుకు సంబ«ందించినవి, లోకజ్ఞానాన్ని, సృజనను ఇచ్చే సాహిత్య సంబంధమైనవి సమానంగా చదవాలన్నమాట. ఇందుకుగాను వారానికి ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్కు సంబంధించిన పుస్తకాలు క్లాస్రూముల్లో విద్యార్థులు చదవడానికి ఉంచుతారు.
ఉదాహరణకు: ఈ వారం మహనీయులు అనే టాపిక్ ఇస్తే చరిత్రలో, స్వాతంత్య్ర పోరాటంలో, తమిళ సంస్కృతిలో గొప్ప గొప్ప పనులు చేసిన వారి గాథలు ఉన్న పుస్తకాలు క్లాసుల్లో ఉంచుతారు. పిల్లల కోసం ప్రతివారం ఎంచదగ్గ టాపిక్కులుగా కథలు, జంతుజాలం, పర్యావరణం, క్రీడలు, సైన్సు తదితరాలను నిర్ణయించారు. క్లాసు పుస్తకాలు చదువుతూనే పై టాపిక్కుల్లోని ఒకోదానిని ఒకోవారం చదవాలన్నమాట. ఇవి కాకుండా కథలు చెప్పడం, కథలు పెద్దగా చదవడం, ఉపన్యాసం, గ్రూప్ డిస్కషన్ వంటి వాటికి సబ్జెక్ట్లతో సమానంగా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
క్లాసులోనే లైబ్రరీ
2024లో తమిళ ప్రభుత్వం ‘వాసిప్పు ఇయక్కం’ (పఠన ఉద్యమం) పేరుతో పాఠశాల విద్యార్థులు నాన్ అకడెమిక్ పుస్తకాల్లో క్లాసుల్లో చదివేందుకు ప్రతి క్లాసులో లైబ్రరీలు ఏర్పాటుకు నడుం బిగించింది. 1 నుంచి 8 తరగతుల్లో వివిధ కేటగిరీల్లో ప్రత్యేకంగా ఎంచిన 250 పుస్తకాలు అందుబాటులో ఉంచాలని సంకల్పం. ఇప్పటికే వివిధ జిల్లాల్లోని బడుల్లో ప్రతి క్లాసులో 120 పుస్తకాలు ఉంచారు. ఇవి మొత్తం కోటీ ముప్పైలక్షల పుస్తకాలు అయ్యాయి. వీటిని వివిధ దశలుగా విభజించారు. అవి:
1. దోగాడు: ఈ కేటగిరిలో బొమ్మలు ఎక్కువ ఉండి ఒకటి రెండు వాక్యాల వచనం ఉంటుంది.
2. నడు: ఈ కేటగిరిలో బొమ్మలతో పాటు ఒక పారాగ్రాఫ్ అంత టెక్ట్స్ మాత్రమే ఉంటుంది. దోగాడులో, నడులో ఏ పుస్తకమైనా 33 పేజీలకు మించదు. ఎందుకంటే చిన్నపిల్లలకు సౌకర్యంగా ఉండాలి కాబట్టి.
3. పరుగు: ఈ దశలో వచనం ఎక్కువగా ఉన్న పుస్తకాలు ఉంటాయి.
4. ఎగురు: ఈ దశలు అన్ని రకాల పెద్ద సైజు పుస్తకాలు ఉంటాయి.
కథలు రాయించారు
ఒకవైపు పుస్తకాలు చదివిస్తూనే విద్యార్థుల చేత కథలు రాయించడం కూడా చేస్తున్నారు. రాసిన కథలను విద్యాశాఖకు పంపితే వాటిలో మంచివాటిని ఎంపిక చేసి పుస్తకాలుగా వేస్తామన్నారు. ఈ ప్రతి పాదనకు కూడా వేల మంది విద్యార్థులు స్పందిస్తున్నారు. అలాగే టీచర్లు కూడా రాస్తున్నారు.
కావలసిన మార్పు
ఒకప్పుడు ప్రభుత్వ బడులలో పి.టి. పిరియడ్ అనీ, క్రాఫ్ట్స్ పిరియడ్ అనీ, ఎన్.సి.సి అనీ, రెడ్క్రాస్ అనీ.. ఇలా అనేక పిరియడ్స్ ఉండేవి. కాలక్రమంలో సబ్జెక్ట్లు తప్ప ఇంకేమీ మిగల్లేదు. అయితే దీనివల్ల విద్యార్థుల్లో వికాసం, సృజన, ఆలోచనా శక్తి, వివేచన పెరగడం లేదని గ్రహించిన వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు పుస్తకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. కేరళలో, కర్నాటకలో ఈ పని సమర్థంగా జరుగుతుండగా తమిళనాడులో కూడా ఊపందుకుంది.
పుస్తకమే స్నేహితుడు
పిల్లలు చదువును ప్రేమిస్తారు. నిజమే. కాని చదువును మాత్రమే నేర్పిస్తూ ఉంటే బోర్ ఫీలవుతారు. వారికి కథలు కావాలి. బొమ్మలు కావాలి. అనేకానేక కబుర్లు కావాలి. ఊహను ఇచ్చే ఊసులు కావాలి. వాటిని వినడానికి, చదవడానికి ఇష్టపడి సంగతులను ఆకళింపు చేసుకునే శక్తిని పెంచుకుంటారు. తమిళనాడులోలాగా ప్రతి ప్రభుత్వ బడిలోని ప్రతి క్లాసులో లైబ్రరీని ఏర్పాటు చేసే ఆలోచన తెలుగు రాష్ట్రాల్లో అమలు కావాలని కోరుకుందాం.