
సేవాపథం
యూత్ అసెంబ్లీ
చదువులు, ఉద్యోగాలు ఆ తర్వాత జీవితపు బాధ్యతలలో తలమునకలవడంతోనే సరిపెట్టుకోకూడదు అనుకుంటుంది నవతరం. సమాజసేవను బాధ్యతగా తీసుకుంటూ చదువు–సేవ రెండింటీని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ద్వారా దాదాపు తొంభై మంది యువ విద్యార్థులు నగరంలోని స్లమ్స్తో పాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని వారికి సేవలు అందిస్తూ ‘మేమున్నాం’ అని బాసటగా నిలుస్తున్నారు. తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలు బాగుపడినప్పుడే దేశం అభివృద్ధిలో ముందంజలో ఉంటుందన్నది మహాత్ముని మాట. ఇప్పుడు ఆ మాటలు నిజం చేస్తూ యువత ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సేవాకార్యక్రమాలను హైదరాబాద్ యూత్ అసెంబ్లీ ద్వారా నిర్వహిస్తున్నారు. తమ సేవాకార్యక్రమాలతో మారుమూలస్థాయి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. నగరంలోని వివిధ కాలేజీల నుంచి 90 మందికి పైగా విద్యార్థులు తమ సేవలను అందిస్తున్నారు. ‘యువతలో సాధికారత, సామాజిక మార్పు’ అనే నినాదంతో వీరు చేస్తున్న సేవాకార్యక్రమాలు స్ఫూర్తిని కలిగిస్తున్నాయి.

ఇరువైపులా అవగాహన
ఇప్పుడు మేం చేస్తున్నది రెవల్యూషనరీ సీజన్. దీనిలో భాగంగా ఉమెన్ ఎంపవర్మెంట్, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, సోలార్ పవర్, శుభ్రత పట్ల అవగాహన, మంచినీటి సౌకర్యం, ఆహార వ్యర్ధాన్ని నిరోధించడం, వాటర్ వీల్ డిస్ట్రిబ్యూషన్... మొదలైన వాటి మీద వర్క్ చేస్తున్నాం. ఇందులో దాదాపు 90 మంది కాలేజీ విద్యార్థులు పాల్గొంటున్నారు. హైదరాబాద్తోపాటు తెలంగాణలోని మారు మూల ప్రాంతాలకు వెళ్లి స్వచ్ఛందంగా వర్క్ చేస్తున్నాం. నగరంలోని స్లమ్స్, గ్రామీణ, గిరిజన ప్రాంతాలలోని సమస్యలను గుర్తించడం, పరిష్కార దిశగా చేసిన ఆలోచలను మూడు నెలలకు ఒకసారి అందరం కలిసి, చర్చిస్తాం. ఎక్కడ ముందస్తు సేవ అవసరం అవుతుందో దానిని ప్రధానంగా తీసుకుంటాం. వీటి ద్వారా చదువొక్కటే కాకుండా సమాజంలో ఉన్న సమస్యలపై అవగాహన కూడా కలుగుతుంది. బాధ్యత పెరుగుతుంది. – లాస్య వంకదారి,ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్, హైదరాబాద్ యూత్ అసెంబ్లీ చైర్ పర్సన్

ప్రాజెక్ట్ రిపోర్ట్తో: ప్రతి సీజన్లో ఎనిమిది ప్రధాన సమస్యలపై వర్క్ చేస్తుంటాం. ముందుగా అందరం కలిసి, చర్చించుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచేసుకుంటాం. మెంబర్స్ అందరం అమ్మానాన్నలు, స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల వారి నుంచి ఫండ్ సేకరిస్తాం. ఆ మొత్తాన్ని యూత్ అసెంబ్లీ ద్వారా ఒక మంచి పనికోసం కేటాయించి, సేవలో పాల్గొనడం సమాజం పట్ల బాధ్యతను, సమస్యల పట్ల అవగాహనను కలిగిస్తుంది. ఈ నెల 31న భద్రాద్రి కొత్తగూడెంలో స్కూల్కి సంబంధించి ఈవెంట్ చేస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న తాండాల వారికి, గర్భవతులకు, పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చేలా ప్లాలాన్ చేస్తున్నాం. నవజాత శిశువులకు అవసరమయ్యే వస్తువులను కూడా అందిస్తున్నాం. కిందటిసారి ములుగులో చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాను. – విజయ్, బిటెక్ ఫస్టియర్,
కరియర్ గైడెన్స్లో అవగాహన: హైదరాబాద్స్ట్రీట్ కాజ్ ఆర్గనైజేషన్లో మూడేళ్ల పాటు వర్క్ చేశాను. ఇప్పుడు యూత్ అసెంబ్లీ నుంచి సేవలు అందిస్తున్నాను. పట్టణాల్లో ఉన్న నిరుపేదల జీవనశైలిని మార్చే ప్రయత్నం, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం, స్కూల్స్కు వెళ్లి కెరియర్ గైడెన్స్ వంటివి చేస్తున్నాం. సిద్దిపేటలోని కిష్టాపూర్, ములుగు ప్రాంతంలోని తక్కెళ్లగూడెంలో సోలార్ ΄్యానెల్స్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ స్కూల్లో వాటర్ ట్యాంక్ ఏర్పాటు, డిజిటల్ అవేర్నెస్... వంటివి చేశాం. – చంద్రశేఖర్, బీటెక్ థర్డ్ ఇయర్, ఇంబ్రహీంపట్నం