HI నాన్న | Parents truly support childrens dreams and do not impose their expectations | Sakshi
Sakshi News home page

HI నాన్న

Jun 17 2026 1:05 AM | Updated on Jun 17 2026 1:05 AM

Parents truly support childrens dreams and do not impose their expectations

‘లేదు’ అనే మాటని ఇంట్లో పిల్లల ముందు పలకడు నాన్న. అడిగితే ఆయన జవాబు ఒక్కటే ‘తీసుకో నాన్నా’. నాన్న జేబుకి చిల్లు ఉంటుంది. కానీ కొడుకు పాకెట్‌ మనీకి లోటు ఉండదు. నాన్న చెప్పులు అరిగిపోతాయి, కానీ కూతురి స్కూల్‌ షూస్‌ కొత్తగా మెరుస్తూ ఉంటాయి. 

నాన్న తన కలల్ని ష్యూరిటీగా ఇచ్చి, పిల్లల కలలకి డౌన్ పేమెంట్‌ కడతాడు. ఫాదర్స్‌ డే జూన్  21న. ఈ సందర్భంగా సమాజంలో ఎందరో సామాన్య అసామాన్య నాన్నలను గుర్తు చేసుకుందాం.

శిక్షణ కోసం రిక్షా అమ్మి..!
కొందరి కలలు నిద్రకే పరిమితమవుతాయి. మరికొందరి కలలు చరిత్రలో నిలిచిపోతాయి. కల సాకారం చేసుకోవాలన్న తపన ఎన్ని కష్టాలనైనా దిగమింగి, ఎంతటి అవాంతరాన్నైనా దాటేందుకు సిద్ధమైనప్పుడు విజయం కాళ్ల దగ్గరకు వస్తుంది. ఇందుకు ఉదాహరణే వారణాసికి చెందిన నారాయణ జైస్వాల్‌ జీవితం. జైస్వాల్‌ జీవితమంతా రిక్షాల చుట్టూతానే తిరిగింది. పగలంతా రిక్షా తొక్కడం, అద్దెలకు ఇవ్వడం, రాత్రయితే భార్యాపిల్లలతో భోంచేసి నిద్రపోవడం తప్ప వేరే ధ్యాసలేదు తనకి... కాని జైస్వాల్‌ కొడుకు గోవింద్‌ జైస్వాల్‌ కల మాత్రం చాలా పెద్దది. 

చిన్నప్పటి నుంచి తను ఐఏఎస్‌ అధికారి కావాలని ఆశపడ్డాడు. ఐఏఎస్‌ కావాలంటే ఆశ ఉంటే సరిపోదు ఆశయం కూడా కావాలి. కాని ఆ ఆశయానికి ఇంధనం కూడా డబ్బే... ఢిల్లీలోని మంచి సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటే తప్ప గోవింద్‌ ఐఏఎస్‌ పాస్‌ కాలేడని జైస్వాల్‌ తెలుసుకున్నాడు. రిక్షా తొక్కితే వచ్చే ఆదాయం కంటే వాటిని అమ్మేస్తే వచ్చే డబ్బుతో మాత్రమే శిక్షణ ఇప్పించవచ్చని అనిపించింది. అంతే... తన కుటుంబానికి ఆధారమైన రిక్షాలన్నింటినీ అమ్మేసి కోచింగ్‌ ఇప్పించాడు. కాని జైస్వాల్‌ కష్టం ఊరికే పోలేదు. 22 ఏళ్ల గోవింద్‌ జైస్వాల్‌ మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్‌ ర్యాంకు సాధించి చూపించాడు.

కిడ్నీ అమ్మి చదివిస్తా..!
తాను దెబ్బతిన్నా తన బిడ్డ బాగుండాలని కోరుకునే ఓ తండ్రి ప్రేమకు అద్దం పట్టే మరో సంఘటన ఇది. గుజరా™Œ లోని నవసారి జిల్లాకు చెందిన జయేష్‌ పటేల్‌ ఓ ప్రమాదం వల్ల చూపు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఉపాధి లేకపోవడంతో భార్యాపిల్లల్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితి. కాని తన కుమారుడు సాహిల్‌ పటేల్‌ ఎప్పటికైనా డాక్టర్‌ కావాలన్నది తన కల. 

ఆ కల తన పేదరికం వల్ల మరుగునపడిపోకూడదని భావించిన జయేష్‌ తన కిడ్నీని అమ్మేసి తన కుమారుడిని చదివిస్తానని ప్రకటించాడు. నా కంట్లో వెలుగు పోయింది. కాని బిడ్డ బతుకు మాత్రం చీకట్లోనే మగ్గిపోకూడదు అంటూ బాధపడ్డాడు. ఈ విషయం సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న పలువురు వచ్చి సాహిల్‌ చదువుకి తమ వంతు సహకారం అందించారు. అలాగే భవిష్యత్‌లో కూడా సాహిల్‌కి అన్ని విధాల అండగా ఉంటామని మాటిచ్చారు. కొడుకు భవిష్యత్‌ బాగుండాలని అందుకు తను ఏమైపోయినా పర్లేదని మాట్లాడిన ఆ తండ్రి ఆవేదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

వైభవ్‌ కోసం భూమిని అమ్మి..!
దేశవ్యాప్తంగా క్రికెట్‌ పేరు చెబితే మొదట వినేమాట బ్యాటింగ్‌ సెన్సేషన్‌ వైభవ్‌ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులో రాజస్థాన్‌ రాయల్స్‌ టీంలో తన అప్రతిహత ప్రతిభను చాటి భళా అనిపించుకున్నాడు. కాని వైభవ్‌ అంతలా రాణించడం వెనుక అతని తండ్రి సంజయ్‌ సూర్యవంశీ కృషి ఉంది. బీహార్‌ లోని తాజ్‌ పూర్‌కి చెందిన ఈ మైథాలీలది మధ్య తరగతి కుటుంబం. అయితే చిన్నప్పటి నుంచి వైభవ్‌ క్రికెట్‌ పట్ల విపరీతమైన ఆసక్తి చూపేవాడు. 

ఇది గమనించిన అతని తండ్రి మరింత ఉన్నత శిక్షణ కోసం తమ పూర్వీకుల భూములను అమ్మేశాడు. తాజ్‌పూర్‌కి, ట్రెయినింగ్‌ సెంటర్‌ మధ్య దాదాపు వంద కి.మీ దూరం ఉండేది. వైభవ్‌ కోసమే ఓ కారుని కూడా కొని అతనికి అన్ని విధాల వెన్నుదన్నుగా నిలిచాడు సంజయ్‌.. తరతరాల ఆస్తి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు..అది అనాదిగా వచ్చే వారసత్వం, బాధ్యత. కానీ అదేది అక్కర్లేదని, కేవలం తన బిడ్డ కలని నిజం చేయడమే లక్ష్యమని సంజయ్‌ సూర్యవంశీ భావించాడు కాబట్టే ఇండియాకి ఈరోజు వైభవ్‌ లాంటి చిచ్చరపిడుగు దొరికాడు.

మీరు కూడా మీ నాన్నతో ఉన్న ఓ మంచి జ్ఞాపకాన్ని మీ నాన్న ఫొటోతో సహా ఈ నంబర్‌కు వాట్సాప్‌ చేయండి. 9281020501
మెయిల్‌ ఐడీ sakshifamily3@gmail.com

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement