సన్నిధి
భారతీయ సంస్కృతిలో తీర్థయాత్ర కేవలం ఒక పర్యటన కాదు. అది మనస్సును, ఆత్మను పరమాత్మతో అనుసంధానించే పవిత్రసాధన. యాత్రలకి వెళ్ళేముందు, ఆయా క్షేత్రాల వెనుకనున్న పురాణగాథల్ని తెలుసుకుని వెళితే, ఆ ప్రదేశాలలోని పవిత్ర స్థలాల ఉనికి,ప్రాముఖ్యతను ప్రత్యక్షంగా చూడటం చేత, ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. సనాతన ధర్మ పురాణ, ఇతిహాసాల పట్ల దృఢ విశ్వాసం ఏర్పడుతుంది. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాన్ని దర్శించటం అదృష్టం. అటువంటి క్షేత్రాలలో నేపాల్లోని ముక్తి క్షేత్రం (ముక్తినాథ్) వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య క్షేత్రాలలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
నేపాల్లోని ముస్తాంగ్ జిల్లాలో రాణీ΄ûవా గ్రామంలో సముద్రమట్టానికి సుమారు 3,710 మీటర్ల ఎత్తులో (12,470 అడుగులు) హిమాలయాల్లోని అన్నపూర్ణ పర్వత శ్రేణుల మధ్య ఈ ఆలయం ఉన్నది. అష్టాదశ పురాణాల్లో ఒకటైన స్కాంద పురాణంలోని హిమవత్ఖండంలో, ముక్తిక్షేత్రం వెనుక ఉన్న వృత్తాంతం అత్యంత రమణీయంగా చెప్పబడింది.
పూర్వం రాక్షసరాజు జలంధరుడు బ్రహ్మ మొదలైన వారినుంచి, తపఃఫలంగా వరాలు పొంది, ఆ అహంకారంతో ముల్లోకాలను పీడించాడు. దేవతలు మొరపెట్టుకున్నా అతనినేమీ చేయలేకపోయారు. కారణం, అతని భార్యయైన బృంద (తులసి) నిరుపమానమైన పాతివ్రత్య శక్తి, అతనికి చావు లేకుండా చేసింది. ఆమె పరమ ధార్మికురాలు. లోకకల్యాణం కోసం, పరమశివుడు, జలంధరుడిని వధించేందుకు వీలుగా, శ్రీమహావిష్ణువు జలంధరుడి వేషంలో బృంద వద్దకు వెళ్ళి, ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తాడు. జలంధరుడి మరణ వార్త విన్న బృంద, తీవ్రమనస్తాపంతో, శ్రీమహావిష్ణువును భూమిపై పాషాణ రూపాన్ని పొందాలని శపిస్తుంది.
బృంద ఇచ్చిన శాపాన్ని భగవంతుడు శిరసావహించాడు (శాప ప్రభావం వలన విష్ణువు నేపాల్లోని కాళీగండకీ నదీ తీరంలో నల్లని సాలగ్రామ శిలలుగా అవతరించాడు. పెద్ద పెద్ద సాలగ్రామ శిలలు నదీ తీరం వెంబడి ఇప్పటికీ విష్ణుస్వరూపంలో దర్శనమిస్తాయి.
రాతి రూపం నుండి, శాప విముక్తి కోసం విష్ణుమూర్తి ఈ ప్రదేశంలో వేలాది సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు ముగిశాక స్వామికి ముక్తి లభించింది. భగవంతుడికే ముక్తిని ప్రసాదించిన క్షేత్రం కాబట్టి ఈ పవిత్ర ప్రదేశానికి ముక్తిక్షేత్రం అనే పేరు వచ్చింది.
చతుర్ముఖ (బ్రహ్మ) బృందాదేవికి మోక్షాన్ని ప్రసాదించి, భూమిపై తులసి రూపంలో సేవింపబడుతూ, గండకీ నది ప్రవహిస్తుందని వరమిచ్చాడు. అంతేగాక, శ్రీమహావిష్ణువు గండకీ నదిలో లభించే సాలగ్రామ శిలల రూపంలో యుగయుగాలపాటు, భక్తులకు దర్శనమిస్తాడని ప్రకటించారు.
ఇక్కడ లభించే సాలగ్రామ శిలలకు మరలప్రాణ ప్రతిష్ఠ అవసరం లేకుండానే పూజించవచ్చని చెబుతారు. సాలగ్రామ ఆరాధన ఇంటికి ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రసాదిస్తుందని విశ్వాసం. ఇక ముక్తినాథ్ ఆలయం చిన్నదైనా,ప్రాంగణం చాలా పెద్దది. ఆలయం ముందు పాపకుండం, పుణ్యకుండం అని రెండు కొలనులుంటాయి.ఈ కుండాల్లోని అతిశీతలమైన జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, దేవాలయం వెనుక వలయాకారంలో ఉన్న 108 గోముఖ జలధారల్లో స్నానమాచరించి, శుభ్రమైన వస్త్రాలు ధరించి స్వామి దర్శనం చేసుకుంటారు. గోముఖాల నుండి వచ్చే హిమాలయ తీర్థం సర్వపాపాల్ని హరిస్తుందని పురాణ కథనం.
సనాతన ధర్మానికి చెందిన భక్తులు, ముక్తినాథుని మోక్షప్రదమైన దివ్యక్షేత్రంగా భావిస్తే, బౌద్ధులు దీనిని ‘చుమిగ్ గ్యాత్సా’ (వంద జలధారల స్థలం) గా భావించి అత్యంత పవిత్రమైన తీర్థంగా పూజిస్తారు. ఆవిధంగా ఈ క్షేత్రం, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆలయ సేవా కార్యక్రమాలలో హిందూ అర్చకులతోపాటు, బౌద్ధ సన్యాసినులు సన్యాసులు కూడా పాల్గొనటం విశేషం. భిన్నమైన ఆరాధన పద్ధతులున్నప్పటికీ, ఒకే మూర్తిని, పవిత్రస్థలాన్ని పరస్పర గౌరవ విశ్వాసాలతో ఆరాధించటం ముక్తినాథ్ ప్రత్యేకత.
ముక్తినాథ్ ఎలా చేరుకోవాలి?
గోరఖ్పూర్ నుంచి సునోలి సరిహద్దు దాటి నేపాల్లోకి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. సునోలి నుండి పోఖ్రా మీదుగా సుమారుగా 300 కి.మీ. రోడ్డుమార్గంలో ప్రయాణించి ‘జోమ్సోమ్’ చేరి, అక్కడి నుండి సుమారుగా 38 కి.మీ. దూరం వెళ్ళి, అక్కడినుంచి మెట్ల మార్గంలో (300 మెట్లు) కానీ, గుర్రాలు, డోలీలలో కానీ ప్రయాణించి ముక్తినాథ్ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ పర్వతప్రాంతం అధిక ఎత్తులో ఉండటంతో, ఆక్సిజన్ తక్కువగా వుంటుంది. కనుక తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి.
ఈ క్షేత్రానికి సులువుగా, త్వరగా చేరాలనుకుంటే, ఢిల్లీ నుండి ఖాట్మండుకి విమానంలో వెళ్ళి, అక్కడి నుండి జోమ్సోమ్కి విమానంలో చేరుకోవచ్చు.
ముక్తినాథ్ క్షేత్రానికి అతిదగ్గరలో ‘జ్వాలామాయి’ ఆలయం శక్తీక్షేత్రం వుంది. బ్రహ్మదేవుడు ముక్తిక్షేత్రంలో ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞం నుండి విష్ణుమూర్తి జలరూపంలో 108 ముక్తి ధారలుగానూ, శివుడు అగ్ని రూపంలో, నిరంతరం వెలిగే జ్వాలగా, ఉండిపోయారు. అందుకే జ్వాలామయి ఆలయంలో నీటి బుగ్గపై అగ్నిజ్వాల వెలగడం మనకు కనిపిస్తుంది. ముక్తినాథ్ ఆలయప్రాంగణం, భక్తిని, ప్రకృతిని, పవిత్రతను ఒకేకాలంలో ఆస్వాదించే అపూర్వ క్షేత్రం. ఒకవైపు నీలగిరి, మరొకవైపు ధవళగిరి పర్వతాలు మంచుతో కప్పబడి ఆహ్లాదాన్ని అందిస్తాయి.
– దావూలూరి రామకృష్ణ శర్మ, ఆధ్యాత్మిక పర్యాటకులు


